యాదగిరిగుట్ట, అగస్టు 3: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు గురువారం నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారు జామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు. ప్రధానాలయం మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహహోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణ తంతును జరిపారు.
కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టింపజేసి నిత్యకల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులను అర్చించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధిసేవ, దర్బార్సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రి వేళలో స్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.13,62,088 ఆదాయం సమకూరినట్లు ఈఓ ఎన్. గీత తెలిపారు.