యాదగిరిగుట్ట, మే 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామివారికి నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గంటన్నరపాటు అర్చక బృందం కల్యాణతంతు జరిపారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణతంతును నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలను అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రి శయనోత్సవం జరిపి ద్వార బంధనం గావించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.23,54,165 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి సేవలో సీఎం సలహాదారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి సేవలో సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ దంపతులు పాల్గొని తరించారు. బుధవారం యాదగిరిగుట్టకు చేరుకున్న వారు స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ గీత స్వామివారి ప్రసాదం అందజేశారు. వారి వెంట కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు ఉన్నారు.