దేశ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. కేసులు నమోదైనా తట్టుకునేలా ప్రభుత్వమే ఉచితంగా బూస్టర్ డోస్లను సిద్ధం చేసింది. అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచింది. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి బూస్టర్ డోస్లను ప్రారంభించనున్నారు. మొదటి, రెండో వ్యాక్సిన్గా కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఏది తీసుకున్నా బూస్టర్ డోస్గా కార్బెవ్యాక్స్ తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు పీహెచ్సీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మంగళవారం 127కరోనా పరీక్షలు నిర్వహించగా, 12 కేసులు నమోదయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వందల నుంచి వేలకు చేరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. వ్యాక్సిన్ డోస్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేక పోవడంతో తెలంగాణ ప్రభుత్వమే ముందుకొచ్చి హైదరాబాద్లో తయారైన కార్బెవ్యాక్స్ను కొనుగోలు చేసింది. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అందిస్తున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 21 పీహెచ్సీలతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లాలో 8 వేల కార్బెవ్యాక్స్ డోస్లు సిద్ధంగా ఉంచారు. ఇందులో 7100 డోస్లు పీహెచ్సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, ఎయిమ్స్కు తరలించారు. 900 డోస్లను బఫర్ స్టాక్గా నిల్వ ఉంచారు. ఒక్కో పీహెచ్సీకి 300 వాయిల్స్ వెళ్లాయి. బూస్టర్ డోస్ కావాలనుకునే వారు స్థానిక పీహెచ్సీలకు వెళ్లాల్సి ఉంటుంది. తమ ఆధార్ కార్డుతో వెళ్తే ఉచితంగా వేయనున్నారు. అయితే 18 ఏండ్లు నిండిన వారు గతంలో ఏ వ్యాక్సిన్ వేసుకున్నా సరే ప్రస్తుతం బూస్టర్ డోస్ వేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలో ప్రికాషనరీ డోస్ తీసుకున్న వాళ్లు ప్రస్తుతం ప్రికాషనరీ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. గతంలో 12 నుంచి 14 ఏండ్ల వయసు గల వారు కార్బెవ్యాక్స్ మొదటి డోస్ తీసుకొని.. రెండో డోస్ తీసుకోనట్లయితే ఇప్పుడు రెండో డోస్గా తీసుకోవాలని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు తెలిపారు.
జిల్లాలో కరోనా కేసులపై జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. జిల్లాలో మంగళవారం 127 కరోనా పరీక్షలు నిర్వహించగా 6 మాత్రమే పాజిటివ్గా నమోదయ్యాయి. ఇక పీహెచ్సీల్లో ప్రతి రోజు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా బూస్టర్ డోస్పై గ్రామాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.