యాదగిరిగుట్ట, జూలై 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాలలో సందడి నెలకొంది. కొండపైకి వాహనాల రద్దీ సాగింది. తెల్లవారుజాము నుంచే స్వయంభువుడిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ధర్మదర్శానికి 4గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
నిత్య తిరు కల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామిని సుమారు 45వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. దీంతో అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.51,41,518 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి సేవలో ట్రాన్స్కో సీఎండీ
లక్ష్మీనరసింహ స్వామిని ట్రాన్స్కో చీఫ్, సీఎండీ డి.ప్రభాకర్రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన మొదటగా స్వయంభువుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ పర్యవేక్షకుడు రాంమోహన్ స్వామివారి ప్రసాదం అందించారు. ఆయన వెంట ఆలయ విద్యుత్ విభాగం ఈఈ వుడేపు రామారావు ఉన్నారు.