సూర్యాపేట రూరల్, మార్చి 21 : సాగు నీరు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, దాంతో చేతికొచ్చిన వరి పంటలు ఎండిపోయాయని -మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట మండలం ఎర్కారం, దుబ్బతండా, రేఖ్యానాయక్తండాలో గురువారం ఎండిన పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల ఇబ్బందులను చూసి చలించి పోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్ఎపీ ఫేస్-2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని, ప్రభుత్వం అవగాహన రాహిత్యం వల్ల రైతులు రోడ్డున పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడుబారడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు.
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్లు కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, పంట నష్టంపై అంచనా వేసి రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, ఎంపీటీసీ లునావత్ శాంతబాయి, నాయకులు మధు, కిరణ్, నవీన్ అనంతరెడ్డి ఉన్నారు.
పంటలను పరిశీలిస్తున్న సమయంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డితో రైతులు తమ ఆవేదనను తెలిపారు. ‘అయ్యా నాకు 8 ఎకరాలు ఉంటే ఐదేండ్ల సంది నీళ్లు వచ్చినట్లే ఈ ఏడు కూడా వస్తాయని మొత్తానికి మొత్తం నాటేసిన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోట్ల మట్టి కొట్టింది. పంట ప్రారంభంలో కొన్ని నీళ్లిచ్చింది. పంటలు చేతికి వచ్చేంత వరకు నీళ్లిస్తామని చెప్పి గప్పుడిన్ని గప్పుడిన్ని నీళ్లను ఇచ్చింది. నీళ్లు అందకు నాకున్న 8 ఎకరాల్లో 6 ఎకరాలు ఎండిపోయి రెండెకరాలు మాత్రమే మిగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే వారే లేరు. మా బతుకులు మళ్లీ ఆగమైనయి’ అని ధరావత్ మాన్య తన గోడు వెల్లబుచ్చాడు.
– ధరావత్ మాన్య, రైతు,
అలాగే మరో రైతు ‘అయ్యా.. బీఆర్ఎస్ హయాంలో పంట పొలాలకు సరిపడా నీళ్లు వస్తే సంతోషంగా పంటలు పండించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నీళ్లను ఇస్తానంది. కానీ తీరా వరిపంట పొట్టకు వచ్చిన సమయంలో నీళ్లు ఇయ్యకపోవడంతో పంటల ఎండిపోయినయి. మా రైతుల కడుపు కాలుస్తున్నది’ కన్నీటి గాథను తెలిపాడు.