నీలగిరి, ఏప్రిల్ 08 : నల్లగొండ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణ కోసం బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని తొలగించి, నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అడిషనల్ ఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు కంపెనీ ద్వారా అందించిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. సైలెన్సర్లలో అనుమతి లేకుండా మార్పులు చేసి అధిక శబ్దం కలిగించే విధంగా ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగించినట్లయితే, అట్టి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేసి, వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగించే వారిపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ, ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్ను కొనసాగిస్తారని తెలిపారు.
జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణం అలాగే ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ఎవరైనా అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్నట్లు గమనించినట్లయితే, సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవ రావు, ట్రాఫిక్ సిఐ మహా లక్ష్మయ్య, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్.ఐ. సైదులు, రూరల్ ఎస్.ఐ సైదా బాబు, కనగల్ ఎస్.ఐ రాజీవ్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

‘సైలెన్సర్లు మార్పిడి చేసి ఇబ్బందులు కలిగిస్తే క్రిమినల్ కేసులు’