చిట్యాల, జూలై 26 : సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడితే క్రిమినల్ కేసులు
నమోదు చేస్తామని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శనివారం చిట్యాల మండలంలోని రహదారిపై వెలిమినేడు వద్ద ఉన్న యాడ్ బ్లూ, డి ఇ ఎఫ్ సేల్ కౌంటర్ను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ డీఇఎఫ్ లో కలుపుతున్న యూరియా ఎలా వస్తుందో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలన్నారు. ఇండస్ట్రీలకు ఇండస్ట్రీ యూరియానే వాడాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఎరువులను ప్రత్యేకించి యూరియాను దారి మళ్లిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను రైతులు మాత్రమే వాడాలని, అలా కాకుండా పరిశ్రమలకు మళ్లించకూడదని, ఏదైనా పరిశ్రమ సబ్సిడీ యూరియాను వాడితే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎరువుల విషయంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారని, అంతేకాక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ చిట్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎరువుల స్టాక్ను పరిశీలించారు. రికార్డులన్నిటిని సక్రమంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో ఎరువులు దుర్వినియోగం కారాదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత సీఈఓ లపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, చిట్యాల తాసీల్దార్ కృష్ణ, ఏఓ గిరిబాబు పాల్గొన్నారు.