పశు సంవర్ధక శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ
దరఖాస్తులకు ఈ నెలాఖరు వరకు అవకాశం
యూనిట్ విలువ రూ.29,400, సబ్సిడీ రూ.25వేలు
నాటు కోడి ధర 400 రూపాయలు దాటింది. మటన్తో పోటీ పడుతూ ముందుకుపోతున్నదే తప్ప తగ్గేదేలే అంటున్నది. ఈ డిమాండ్ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పెరటి కోడి పిల్లలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. యూనిట్ విలువ రూ.29,400 కాగా, 85శాతం రాయితీ అందించనున్నది. ఆసక్తి గల వారు 4,800 రూపాయలతో బ్యాంకు డీడీ తీసి ఈ నెలాఖరులోగా పశు సంవర్ధక శాఖ అధికారులకు దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది.
నల్లగొండ, మే 15 : నాటు కోళ్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో వాటి పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఏటా సబ్సిడీపై పిల్లల్ని అందిస్తుండగా ఈ ఏడాది సైతం పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఆర్థిక వనరులు సమకూర్చాలనే ఉద్దేశంతో 200 కోడి పిల్లలు యూనిట్గా 85శాతం సబ్సిడీ కల్పిస్తున్నది. ఆసక్తి కలిగిన వారు ఈ నెలాఖరు నాటికి దరఖాస్తు చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ సూచిస్తున్నది.
85శాతం సబ్సిడీతో..
కోడి పిల్లల యూనిట్ విలువ రూ.29,400 కాగా, రూ.25వేలు సబ్సిడీ కల్పించి లబ్ధిదారుడి వాటా రూ.4,800గా నిర్ణయించారు. 200 కోడి పిల్లలతోపాటు రూ.15వేల విలువ కలిగిన కేజ్(బుట్టలు) అందించనున్నారు. ప్రతి కోడి పిల్ల అరకిలో బరువుండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెలాఖరు నాటికి దరఖాస్తుల ఆహ్వానం..
పెరటి కోళ్ల పెంపకం విషయంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం కల్పించింది. వారి జీవన విధానం మెరుగు పడాలనే ఉద్దేశంతో 85శాతం సబ్సిడీతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఆసక్తి గల వారు ఈ నెలాఖరు నాటికి జేడీ పశు సంవర్ధక శాఖ పేరుతో ఏదైనా బ్యాంకులో డీడీ చెల్లించి అందజేయాలి. రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారులకు పెరటి కోళ్లు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.
డీడీలు ఇచ్చిన వెంటనే పెరటి కోళ్లు అందిస్తాం..
పెరటి కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీలు పశు సంవర్ధక శాఖ పేరిట రూ.4,800 డీడీ చెల్లించి దరఖాస్తు చేయాలి. దాంతో రెండు మూడు రోజుల్లో పెరటి కోళ్లతో పాటు బుట్టలు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీల జీవన విధానం పెరుగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాసరావు, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి, నల్లగొండ