కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం కన్న కలలన్నీ సాకారమవుతున్నాయని, చెప్పిన ప్రతి మాటా నిజం చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో బీజేపీ ఎస్సీ సెల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వల్దాస్ ఉపేందర్ వందలాది అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్లకుపైగా పాలించి తెలంగాణను అన్ని విధాలుగా ఆగం చేసిన విపక్ష పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని, బీఆర్ఎస్ ప్రశాంత పాలనలో నిరంతర అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. 2014కు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధి, మార్పుపై నేడు చర్చ జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి స్వచ్ఛందంగా గులాబీ గూటికి చేరుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నదని, ఇతర రాష్ర్టాల్లో ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.
– సూర్యాపేట టౌన్, జూలై 7
సూర్యాపేట టౌన్, జూలై 7 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. తెలంగాణ వస్తే ఎదైతే సాకారం అవుతుందని కళలు కన్నామో.. ఆ కళలు సాకారమవుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. 60ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా ఆగం చేసిన విపక్ష పార్టీలకు ఓట్లు అడిగే అర్హతే లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో నిరంతర అభివృద్ధి జరుగుతుందని, అందుకే అందరూ ఏకమై స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో ఆయన సమక్షంలో బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ ఉపేందర్ వందలాది నాయకులు, అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో అన్ని విధాలుగా ఆగం చేసింది కాక ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు విపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నామన్నారు.
గతంలో రౌడీయిజం, సిండికేట్ దందాలతో సూర్యాపేటను అన్ని విధాలుగా ఆగం చేస్తే.. తొమ్మిదేండ్లుగా ప్రశాంత వాతావరణంలో నిరంతర అభివృద్ధి పాలనలో ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం నేర్పింది పంచాయితీలు కాదని.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ అవసరమైన అభివృద్ధి పాలన అందించడమేనని పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం ఆయన నాయకత్వాన్ని యావ త్ దేశం కోరుకుంటుందని తెలిపారు. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకుని.. ఆ కష్టాలను తీరూస్తూ నిరంతరం అభివృద్ధి పాలన సాగిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. యావత్ దేశంలోనే మరెక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిసున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
నిరంతర విద్యుత్తో పాటు తాగు, సాగు నీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఏదో రకంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో ఆడపిల్లల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. 2014 కు ముందు తర్వాత జరిగిన అభివృద్ధిలో మార్పులు గమనించి అందరూ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులుతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, పట్టణ, మండల అధ్యక్షులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.