దామరచర్ల, ఫిబ్రవరి 23 : రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను తీర్చడానికి నాటి సీఎం కేసీఆర్ దామరచర్ల మండలంలో రూ.34వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి నాటి సీఎండీ ప్రభాకర్రావు సమక్షంలో 80 శాతం పనులు పూర్తి చేశారు. ప్లాంట్ ఒకటి, ప్లాంట్ రెండు పనులు పూర్తి చేసుకొని ట్రయల్ రన్కు సిద్ధంగా ఉన్నాయి. రెండు యూనిట్ల నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానున్నది. కరోనా సమయంలో లాక్డౌన్లు లేకపోతే ఇప్పటికే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభమై వెలుగులిచ్చేది.
వరుసగా రెండేండ్లు లాక్డౌన్ రావడంతో పదివేల మంది కార్మికులు వారి ప్రాంతాలకు వెళ్లడడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత పనుల్లో వేగం పెంచారు. ప్రజాభిప్రాయం సేకరణ నిర్వహించిన తర్వాతనే ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని ఎన్జీటీ ఆదేశాల మేరకు నాలుగు రోజుల క్రితం ప్లాంట్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్లాంట్ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని ప్రజలు మూకుమ్మడిగా అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక కాంగ్రెస్ శాసన సభ్యుడు బీఎల్ఆర్ కూడా అనుకూలంగా మద్దతు తెలిపి రాజకీయాలకు అతీతంగా అందరూ ప్లాంట్ ఏర్పాటును సమర్థించాలని కోరారు.
దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్లాంట్ పై సానుకూలత వ్యక్తం చేసినట్లయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పవర్ ప్లాంట్ పనులపై ప్రత్యే క దృష్టిని పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చి త్వరితగతిన పనులు పూర్తి చేస్తే రాష్ట్రంలో కరెంట్ కోతలను అధిగమించవచ్చని నిపుణులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. నాడు కేసీఆర్ ముందు చూపు నేటి ప్రభుత్వానికి కలిసిరానున్నదని పలువురు చర్చించుకుంటున్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం రానున్నారు. ప్లాంట్లో పనుల ప్రగతిని తెలుసుకొని స్థానిక టీఎస్ జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణ వివరాలు, చేపట్టాల్సిన పనుల గురించి తెలుసుకోనున్నారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్లో పనులు వేగవంతంగా నడుస్తున్నాయని, రానున్న జూన్ – జూలై వరకు రెండు యూనిట్ల నుంచి విద్యుత్ను ప్రారంభిస్తామని యాదాద్రి పవర్ప్లాంట్ సీఈ సమ్మయ్య తెలిపారు.