నేరేడుచర్ల, నవంబర్ 25 : హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కాల్వలపై నూతన వంతెనల నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది. దాంతో ఇరుకైన వంతెనలపై ఎన్నో ఏండ్లుగా అవస్థలు పడుతున్న రైతులు, ప్రజానీకం ఇక్కట్లు తొలగనున్నాయి. ఈ వంతెనలను నిర్మించాలని గత ప్రభుత్వాల హయాంలో ఎన్నోసార్లు విన్న వించినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు లను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లి హుజూర్నగర్, గరిడేపల్లి మండలాల్లోని సాగర్ ప్రధాన కాల్వ, ముక్త్యాల కాల్వపై నాలుగు వంతెనలు నిర్మించడానికి రూ. 3 కోట్ల 96లక్షల, 90వేలు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
నియోజకవర్గంలోని కరక్కాయాలగూడెం, వేపలసింగారం, కతుబ్షాపురం,వెలిదండ గ్రామాల సమీపంలోని కాల్వలపై నూతన వంతెనలను నిర్మించనున్నారు. హుజూర్నగర్ మండలం కరక్కాయలగూడెం సమీపంలోని ముక్త్యాల బ్రాంచ్ కాల్వపైన 12.90 పాయింట్ వద్ద రూ.49.10లక్షలతో సింగిల్ లైన్ రోడ్డు, వంతెన నిర్మాణం, వేపల సింగారం గ్రామం సమీపంలోని రామపురం మేజర్పై 3.300 పాయింట్ వద్ద రూ. 18లక్షలతో సింగిల్ లైన్ రోడ్డు, వంతెన , గరిడేపల్లి మండలంలోని కుతుబ్షాపురం సమీపంలో సాగర్ ఎడమ కాల్వపైన 95.010 పాయింట్ వద్ద రూ. 1,36,30,000లతో సింగిల్ లైన్ రోడ్డు వంతెన, వెలిదండ సమీపంలోని సాగర్ కాల్వపైన 93.080 పాయింట్ వద్ద రూ. 1,93,50,000 సింగిల్ లైన్ రోడ్డు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.
గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై నూతన వంతెన నిర్మించడం ద్వారా మునగాల వెళ్లేందుకు దూరం తగ్గనుంది. కుతుబ్షాపురం సమీపంలోని కాల్వపై మూడు అడుగుల వెడల్పు వంతెన ఉండేది. దాంతో వలన కేవలం ద్విచక్రవాహనాలు మాత్రమే రాకపోకలు సాగేవి. వాస్తవకంగా కాల్వకు ఒక పక్కన గ్రామం ఉండగా మరో పక్క పొలాలు ఉండటంతో గత్యంతరం లేక ప్రజలు గడ్డిపల్లి మీదుగా సుమారు 5 కిలోమీటర్లు ప్రయా ణించాల్సి వచ్చేది. ఇక్కడ బిడ్జ్రి నిర్మిస్తే ఈ దూరంతో పాటు గ్రామానికి మర్రికుంట నుంచి కాల్వ కట్ట మీదుగా వెళ్తే 3 కి.మీ దూరం తగ్గే అవకాశం ఉన్నది.
కరక్కాయలగూడెం సమీపంలో వంతెన నిర్మించాలని ప్రజలు 25 ఏండ్లుగా రాజకీయ నాయకులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే శానం పూడికి సమస్యను వివ రించడంతో ఇప్పుడు నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కాగా సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెబుతున్నారు. వేపల సింగారం సమీపంలో రామాపురం మేజర్ కాల్వపైన నిర్మించే వంతెనతో రైతుల ఇక్కట్లు తొలగిపోనున్నాయి.
హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై వెనుకబడిని నియోకవవర్గాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో ఇప్పటికే రూ. 3,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. నూతన వంతెనల నిర్మాణంతో రైతులు, ప్రజల ఇక్కట్లు తొలగిపోనున్నాయి.
– శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్యే, హుజూర్నగర్ నియోజకవర్గం