దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యం లేక అవస్థలు పడ్డ రెండు జిల్లాల ప్రజల వెతలు తీరనున్నాయి. మానాయికుంట, గురజాల గ్రామాల మధ్య మూసీ వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రెండు దశాబ్దాలకు పైగా ఎదురుచూస్తున్న ప్రజల కల నిజం కాబోతున్నది. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ చొరవతో వంతెన కల నెరవేరింది. యాదాద్రి-నల్లగొండ జిల్లాలను అనుసంధానం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. పనులు పూర్తి కాగా.. ఎమ్మెల్యే కిశోర్కుమార్ సోమవారం ప్రారంభించనున్నారు. దీంతో దూరభారం తగ్గడంతోపాటు రెండు జిల్లాల ప్రజల రవాణా ఇబ్బందులు తీరనున్నాయి.
అడ్డగూడూరు మండలంలోని మానాయికుంట, గురజాల గ్రామాల మధ్య మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు ఏండ్ల తరబడి కోరినప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు అడ్డగూడూరు, శాలిగౌరారం మండలాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. మానాయికుంట – గురజాల గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల దూరమే ఉండగా.. మూసీ వాగు ప్రవహించినప్పుడల్లా రాకపోకలకు అంతరాయం కలిగేది. దీంతో ఆ గ్రామాలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు మోత్కూరు, అమ్మనబోలు మీదుగా సూమారు 50కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. మండలంలోని ప్రజలు శాలిగౌరారం, నకిరేకల్, నల్లగొండ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. మూసీలో నీరు ప్రవహిస్తే బండిని నెట్టుకుంటూ వెళ్లేవారు. అయితే.. స్వరాష్ట్రంలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ చొరవతో మానాయికుంట – గురజాల బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసింది. వంతెన పనులు పూర్తి కాగా.. సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే శాలిగౌరారం, అడ్డగూడూరు మండలాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఉండదు. అదేవిధంగా బ్రిడ్జి దగ్గర నుంచి గురజాల తుడిమిడి రోడ్డు వరకు డబుల్ రోడ్డు, మానాయికుంట గ్రామ శివారు వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు హైలెవల్ బ్రిడ్జికి మరో రూ.2.50 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి మీది నుంచి రాకపోకలు సాగుతుండగా.. స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసే రోజుల్లో ఏటిలోంచి నడుచుకుంటూ పోయో ప్రజల కష్టాలను చూసి చలించిపోయా. అధికారంలోకి రాగానే బ్రిడ్డి నిర్మాణం చేపడుతానని హామీ ఇవ్వడం జరిగింది. 2017లోనే బ్రిడ్జి నిర్మాణానికి శిలాఫలకం వేశాం కానీ.. విస్తారంగా కురిసిన వర్షాలతో పనులు ఆలస్యమయ్యాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయి నేడు ప్రారంభించుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నది. మానాయికుంట నుంచి గురజాలకు 3కిలోమీటర్లు మాత్రమే. కానీ.. ఈ రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే అనాజిపురం, అమ్మనబోలు మీదుగా దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుండేవారు. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏండ్ల కల అడ్డగూడూరు మండలం చేయడం, మానాయికుంట – గురజాల బ్రిడ్జి నిర్మించడం. ఈ రెండు సీఎం కేసీఆర్ సహకారంతో నా చేతుల మీదుగా చేయడం సంతోషంగా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రచారానికి వచ్చిన నాయకులు బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తే కచ్చితంగా చేస్తుందని నిరూపించాం.
– గాదరి కిశోర్కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతోనే మానాయికుంట బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. అడ్డగూడూరు నుంచి గురజాల గ్రామానికి 5కిలోమీర్లు. వరద వచ్చినప్పుడు అమ్మనబోలు మీదుగా దాదాపు 40 కి.మీ. ప్రయాణించాల్సి వస్తుంది. బ్రిడ్జి నిర్మాణం పూర్తవడంతో నియోజకవర్గంలోని ప్రజలతోపాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగాం, వరంగల్ జిల్లాలకు ప్రధాన రహదారి కానుంది.
– కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, అడ్డగూడూరు
గతంలో వానకాలం వచ్చిందంటే ఏటి అవతలి గ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. నీళ్లల్లో బైక్ను నెట్టుకుంటూ వెళ్లేవాళ్లం. మూసీపై బ్రిడ్జి నిర్మించడం సంతోషకరం. దశాబ్దాల కల నెరవేరింది. మానాయికుంట బ్రిడ్జి నిర్మాణానికి చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కిశోర్కుమార్కు ఈ ప్రాంత ప్రజలం ఎప్పటికీ రుణపడి ఉంటాం.
మా ఊర్లో ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మిస్తారని కలలో కూడా అనుకోలేదు. గతంలో వానకాలం వచ్చిందంటే రాకపోకలు బంద్ అయ్యేది. పక్కనే 3కిలోమీటర్ల దూరంలో ఉన్న గురజాల గ్రామంలోని మా బంధువుల ఇంటికి వెళ్లాలంటే 50 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బ్రిడ్జి నిర్మించడంతో ఏండ్ల నాటి సమస్య తీరింది. గ్రామస్తులంతా ఎమ్మెల్యే కిశోర్కుమార్కు, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.