నార్కట్పల్లి, జూన్ 7 : సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ సాగునీటి దినోత్సవ ప్రగతి నివేదిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుతో పాటు, సాగునీటి రంగంలో అద్భుత ఫలితాలు సాధించారని అన్నారు. అందుకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టునేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతో అసాధ్యం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం నాలుగేండ్లలో పూర్తి చేసి ప్రపచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరు సాధించారన్నారు. సాగునీటి రంగంలోనే గాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే రోల్ మోడల్గా రాష్ట్రం పేరు గాంచిందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల పబ్బం గడుపుకునే మాటలు నమ్మవద్దని సూచించారు.
తెలంగాణలో వేరే పార్టీ అధికారంలోకొస్తే కుక్కలు చించిన విస్తరిలా తయారవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలంటే ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గానికి కృష్ణా, గోదావరి, మూసీ మూడు నదుల నీరు అందుతుందని కనుక త్రివేణి సంగమంగా పేరు ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికి 2లక్షల ఎకరాలకు సాగు నీరు అందేందుకు ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందన్నారు. ఏఎమ్మాఆర్ ఎస్ఎల్బీసీ పనులు త్వరలో పూర్తికానున్నట్లు తెలిపారు. పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంచనా విలువ రూ.578.30కోట్లకు గాను రూ.170.60కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఉదయసముద్రం ప్రాజెక్టు పూర్తై ఈమధ్యనే ట్రయల్ రన్ ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ను నింపినట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి మాట్లాడుతూ 2014 కంటే ముందు తలాపున కృష్ణ, గోదావరి జలాలు ఉన్నా నీరు రాక రైతులు ఎంతో ఇబ్బంది పడేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా రైతుకు వరంగా మారిందన్నారు.
ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం పూర్తైందని రెండు నెలల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నీటి కష్టాలు పోయాయన్నారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ విముక్తి జరగడంతో పాటు, కోటి ఎకరాలకు నీరు అందేలా ప్రాజెక్టులు రూపొందించారన్నారు. కాంట్రాక్టర్ అసమర్ధత వల్ల ధర్మారెడ్డి పిల్లాయపల్లి కాల్వ పనులు ఆగాయని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ వివరించామని, త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తై పనులు జరుగుతాయని తెలిపారు. కార్యాక్రమంలో ఇరిగేషన్ శాఖ సీఈ అజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, విశ్రాంత సీఈ శ్యాంప్రసాద్రెడ్డి, విశ్రాంత ఇంజనీర్ రమణనాయక్, నార్కట్పల్లి, చిట్యాల మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.