కట్టంగూర్, ఫిబ్రవరి 25 : రోడ్డు ప్రమాదంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామ శివారులో 65 జాతీయ రహదారిపై చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పామనుగుండ్ల గ్రామ శివారులో జాతీయ రహదారిపై డీసీఎం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, మరో వాహనం ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాల డ్రైవర్లు గోడవ పడడంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదంపై పోలీసులకు సమాచారం రావడంతో కట్టంగూర్ పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గంట శంకర్, హోంగార్డు మల్లం విజయకుమార్ సంఘటన స్థలానికి వెళ్లారు.
ఇరువురు రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేస్తుండగా అదే సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగంతో అజాగ్రత్తగా నడుపుతూ కానిస్టేబుల్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ శంకర్ ను చికిత్స కోసం నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.