సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. ఒక్కొక్కరుగా ఆ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రెండ్రోజుల క్రితం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ చేరగా, తాజాగా శుక్రవారం పార్టీ కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మాసాగర్రెడ్డి గులాబీ కండువా కప్పుకొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్రెడ్డి ఊహించని విధంగా అభివృద్ధి చేయడంతో విపక్ష నాయకులు బీఆర్ఎస్ బాట పడుతున్నారు. ఇప్పటికే పేట మున్సిపాలిటీలో ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒకరు బీజేపీ కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరగా, మరికొంత మంది తమ అనుచరులతో గులాబీ కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో నాయకులు, పార్టీ శ్రేణులు లేక ఇప్పటికే బీజేపీ ఉనికి కోల్పోగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నది.
సూర్యాపేట, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి జనం జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. దానికి ఉదాహరణే 2014 తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్సే గెలుస్తుండడం. ప్రధానం గా సూర్యాపేట విషయానికి వస్తే అభివృద్ధి విషయంలో జగదీశ్రెడ్డికి ముందు తర్వాత అనే రీతిన ఉందని స్వయానా ప్రతిపక్ష నాయకులు కొందరు పలుమార్లు బహిరంగంగా చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో గత మున్సిపల్ ఎన్నికల్లో సొంత ఇమేజ్తో గెలిచిన ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు నియోజకవర్గ వ్యా ప్తంగా జనం వెంటే తాము ఉండాలనే ఉద్ధేశ్యం తో బీఆర్ఎస్ కండువాలు కప్పుకుంటున్నారు. దీంతో సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటుంది.
సిరివెళ్ల నుంచి కొండపల్లి వరకు ఐదుగురు
ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ, ధరావత్ లీలాబాయి, బచ్చలకూరి శ్రీను గతంలో బీఆర్ఎస్లో చేరగా రెండ్రోజుల క్రితమే భారీ ఎత్తున అనుచరులతో చేరిన మడిపల్లి విక్రమ్, శుక్రవారం 33వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మాసాగర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. వీరందరినీ మంత్రి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్రెడ్డి, జాతీయ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్కుమార్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రషీద్, పట్టణ కార్యదర్శి అబ్దుల్ రహమాన్, పట్టణ నాయకులు జమాల్బాబా, పుట్ట రవీందర్రెడ్డి, అమర్నాథ్రెడ్డితో పాటు పలువురు చేరారు. బీజేపీ నుంచి ఐదుగురు కౌన్సిలర్లలో జాటోతు లక్ష్మి ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు జహీర్, మడిపల్లి విక్రమ్, నాయకులు బైరు వెంకన్న, గుడిపుడి వెంకటేశ్వర్రావు, సయ్యద్ సలీం, మీలా వంశీ, బైరబోయిన శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.