హాలియా, పిబ్రవరి 11: ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆరోపించా రు. బుధవారం హాలియాలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెసోళ్లు ఓటమి భయంతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు విశ్వప్రయత్నం చేశారన్నారు. చివరి గంటలో భారీగా దొంగ ఓట్లు వేయించారని తెలిపారు. 4, 7, 11, 12 వార్డుల్లో దొంగ ఓట్లు వేయించుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
4వ వార్డుకు సంబంధించి వీరమల్ల వెంకన్న, జ్యోతి, నిఖిల్ అమెరికాలో ఉంటున్నారు. వారు ఓటేసేందుకు రాకపోయినా కాంగ్రెసోళ్లు వారి ఓట్లను వేరే వారితో వేయించారన్నారు. 4వ వార్డులోనూ అగ్రకుల సామాజికవర్గంపై బీఆర్ఎస్ తరఫున జంగాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీలో నిలబెట్టినట్లు తెలిపారు. ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంటే రూ.30లక్షలు ఇస్తామని మం ద నర్సిరెడ్డి, మంద నరేందర్రెడ్డి ఆశ చూపినప్పటికీ ఆమె ప్రలోభాలకు లొంగలేదన్నారు. ఈ వార్డులో గతంలో 1200 ఓట్లకు 800 ఓట్లు పోలైతే, ఇప్పుడు 1000 ఓట్లకు 900 ఓట్లు పోలయ్యాయన్నారు.
కాంగ్రెస్ నాయకులు పోలీసులతో కుమ్మకై దొంగ ఓట్లు వేయించుకుంటున్నారన్నారు. 4వ వార్డులో దొంగ ఓటు వేయించేందుకు కాంగ్రెస్ నాయకులు తీసుకువచ్చిన వ్యక్తిని బీఆర్ఎస్ అభ్యర్థి పట్టుకొని అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ సురేశ్కు అప్పగిస్తే ఆయన అక్కడి నుంచి పంపిం చి ఇక్కడేమీ జరగలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నందికొండ మున్సిపాలిటీలో లిక్కర్ వ్యాపారి రాజాప్రసాద్ 3వ వార్డులో 50 ఓట్ల వరకు దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.
అక్క డ, ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్లు ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా వినకుండా పోలింగ్ అధికారులు కాంగ్రెస్ నేతలకు సహకరిస్తున్నారని తెలిపారు. 3 వార్డులోనూ ఇది దొంగ ఓటని ఏజంట్ ఫిర్యాదు చేస్తే.. వీడికేం తెలుసు.. అంటూ అక్కడ ఉన్న ఎస్సై, కాంగ్రెస్ అభ్యర్థి రాజా ప్రసాద్కు వత్తాసు పలకడం దారుణమన్నారు. పోలింగ్కు ముందు రోజు రాత్రి కాంగ్రెసోళ్లు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందకు మద్యం, మాంసం, డబ్బులు, చీరలు పంపిణీ చేశారని తెలిపారు. దొంగ ఓట్లపై 4వ వార్డు అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హామీ ఇచ్చినట్లు తెలిపారు.