సూర్యాపేట, జనవరి 27 (నమస్తే తెలంగాణ) /బొడ్రాయిబజార్ : సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్పై కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. విపక్షాలన్నీ ఏకమై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను దించి, ఆ స్థానాలను కైవసం చేసుకోవాలని పన్నిన కుట్రను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి వమ్ము చేశారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు.
నాలుగేండ్ల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సరిపడా మెజారిటీ వచ్చింది. సూర్యాపేట జనరల్ స్థానం అయినప్పటికీ అప్పటి విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆ స్థానంలో ఎస్సీ మహిళా కౌన్సిలర్ పెరుమాళ్ల అన్నపూర్ణను చైర్పర్సన్గా, తెలంగాణ ఉద్యమ నాయకుడు పుట్ట కిశోర్ను వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారు. వీరి ఆధ్వర్యంలో నాలుగేండ్లపాటు మున్సిపాలిటీ పాలన సజావుగా కొనసాగింది. ఇటీవల ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్, బీజేపీలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఆయా స్థానాలను కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయి.
ఈ క్రమంలో సూ ర్యాపేట మున్సిపాలిటీలో కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ తమవైపునకు తిప్పుకొంది. దాంతో పాటు బీజేపీ, బీఎస్పీకి చెందిన వారితో కలిపి 32 మంది కౌన్సిలర్ల మద్దతుతో చైర్పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. సూర్యాపేటలో 48 వార్డులు ఉండగా బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్ 15, బీజేపీ 5, ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. ఒక కాంగ్రెస్ కౌన్సిలర్కు ప్రభుత్వ ఉద్యోగం రాగా ఆయన రాజీనామా చేశారు. సూర్యాపే ట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఓటు హక్కు కలిగి ఉండడంతో కౌన్సిల్లో 48 ఓట్లు ఉన్నాయి.
అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు కౌన్సిలర్లు పార్టీలు మారారు. చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టి నెగ్గాలంటే 32 మంది(మూడో వంతు) కౌన్సిలర్లు ఓటు వేయాలి. దాంతో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఏకమై కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఎరవేసి 32 మందితో సంతకాలు చేసి చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మాం ప్రతిపాదిస్తూ ఈ నెల 10న జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్కు వినతిపత్రం అందించా రు. సదరు తీర్మానంపై ఈ నెల 27న ఓటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బీఆర్ఎస్కు ఎమ్మెల్యే ఓటుతో కలిపి 16 మంది మద్దతు ఉంది.
మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. తమ పార్టీతో పాటు బీజేపీ, బీఎస్పీకి చెందిన 32 మంది కౌన్సిలర్లను హైదరాబాద్, గోవాతో పాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఇందుకు నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు పర్యవేక్షించగా సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. క్యాంపుకు వెళ్లిన 32 మందిలో బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు రెండు రోజుల ముందు తాము అవిశ్వాసానికి దూరంగా ఉంటామంటూ గేమ్ ఆడి బీఆర్ఎస్ శిబిరంలో చేరారు. మరుసటి రోజు ఇప్పుడే వస్తామని బయటకు వెళ్లి తిరిగి రాలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు.
ఆ ముగ్గురికీ హైదరాబాద్ సీఎం చాంబర్ కేంద్రంగా ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారని, అందుకే తాము బీఆర్ఎస్కు మద్దతిచ్చినట్లు నమ్మించి మైండ్గేమ్ ఆడేందుకు కుట్ర చేశారని వారు పేర్కొంటున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి చక్రం తిప్పడంతో వారి కుట్రలు సాగలేదు. శనివారం మున్సిపాలిటీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి చొరవతో అవతలి శిబిరం నుంచి ఒక కౌన్సిలర్ బీఆర్ఎస్ శిబిరంలోకి వచ్చినట్లు తెలిసింది. దాంతో విపక్ష కూటమి బలం 31కి పడిపోగా వారు హాజరైనా ఫలితం ఉండదని భావించి సమావేశానికి రాలేదని సమాచారం. దాంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు కలెక్టర్ ప్రకటించారు. మున్సిపల్ చైర్పర్సన్గా పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్గా పుట్ట కిశోర్ కొనసాగనున్నారు.
దళిత మహిళా చైర్ పర్సన్పై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాల నాయకులువారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు. అయితే శనివారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వివిధ దళిత సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి సూర్యాపేట రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు తప్పెట్ల శ్రీరాములు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని నాగభూషణం, మహిళా నాయకులు కంచి సరిత, మారపాక ఉప్పలమ్మ, బానోతు నీలమ్మ, బొడ్డు రజని, అనుములపురి భాను ఉన్నారు.