గుర్రంపోడ్, జులై 02 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన హమీలను విస్మరించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడ్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు అమలు కాని హమీలను ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ హమీలను ముఖ్యమంత్రి, మంత్రులు మర్చిపోయారన్నారు. 2014 కంటే మందు తెలంగాణ వ్యవసాయ రంగం దయనీయంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రైతు కుటంబం నుండి వచ్చినవారు కాబట్టి రైతాంగం కష్టాలను చూసి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్తో పాటు ముందు చూపుతో ఎరువులను, సాగు నీరును అందించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో వరి ధాన్యం పండించిన విషయంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారని కొనియాడారు.
రైతు బంధు ద్వారా ఎకరానికి సంవత్సరానికి రూ.10 వేల పెట్టుబడి సహయం, రైతు బీమా అందించిన ఘనత దేశంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. పండించిన పంటను ఎలాంటి కట్లంగ్లు లేకుండా గిట్టుబాట ధరకు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. కేసీఆర్ హయంలో వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల బలోపేతం చేశారన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు పండించిన పంటకు క్వింటాకు 8 కిలోల చొప్పున సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు తరుగు పేరున తక్కువ చేసి రైతులను దగా చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి కార్పోరేట్ స్థాయిలో విద్యను అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మెయింటనెన్స్ కూడా చేయడం లేదన్నారు. వృద్ధాప్య పెంచన్లను రూ.200 నుండి రూ.2 వేలు చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు 1,00,116 ఇచ్చారన్నారు.
అన్ని రంగాలలో తెలంగాణను అగ్రగామిగా కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. ముందుచూపు లేకుండా కృష్ణా నది జలాలను ఆంధ్రాకు తీసుకేళ్తుంటే సోయి లేకుండా మంత్రులు ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సామల బోజ్జయ్య, నాయకలు ఎల్ఎన్ రెడ్డి, వడిత్య నాగరాజు నాయక్, మునికుంట్ల బాల్ రెడ్డి, కూనూరు సైదిరెడ్డి, జాల మల్లెషం, మల్లోజు శ్రీనివాస్ చారి, పోలె రామచంద్రం, కుంభం ప్రశాంత్ రెడ్డి, తెలుకుంట్ల కుర్మాల్ రెడ్డి, మునికుంట్ల రాజేష్ రెడ్డి, వేముల యాదయ్య, షేక్ సిరాజ్, ఎలుకొండ నగేశ్ పాల్గొన్నారు.