నల్లగొండ, నవంబర్ 29 : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ పెడతామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కాలమ్స్తో తిప్పలు పడాల్సిందేనా? అని రైతుల ఆందోళన.. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామన్న భట్టి మాటలతో పట్టాదారుల్లో గుబులు.. 24 గంటల కరెంట్ వద్దు 3 గంటలే సరిపోతది అన్న రేవంత్ మాటలతో పొలం పారేదెట్టా అనే బాధ.. రైతుబంధు దుబారా అంటున్న ఉత్తమ్ మాటలతో ఆవేదన.. ఇవీ రైతుల మదిని తొలుస్తున్న చిక్కు ప్రశ్నలు. పదేండ్లుగా వ్యవసాయ రంగంలో ఎన్నో కొత్త కోణాలు, మార్పులు, ఆవిష్కరణలు చేస్తున్న క్రమంలో మేం అధికారంలోకి వస్తే అన్నదాతపై ఉన్న కసిని ఎల్లగక్కే మాటలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇంత కసి ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏంటి అనే పరిస్థితిలో అల్లాడుతున్న అన్నదాతల హృదయాలు మరోసారి కేసీఆరే అంటూ ఆరాటపడుతున్నాయి.
కాంగ్రెస్ వస్తే కొత్త పంచాయితీలు వస్తాయి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే కౌలుదారీ చట్టం తీసుకొస్తామంటున్నది. దాంతో తెలంగాణలో పట్టాదారు రైతులు, కౌలురైతుల మధ్య కొత్త పంచాయితీలు వస్తాయి. పట్టాదారులకు ఇవ్వకుండా కౌలు రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ నాయకుల ప్రకటనలతో పట్టాదారు రైతుల్లో భయం మొదలైంది. భూ యజమానులు ఎవరూ తమ భూములను కౌలుకు ఇవ్వడానికి ఒప్పుకోరు. కౌలురైతు, పట్టాదారు రైతు మధ్య ఏనాడూ రాతపూర్వక ఒప్పందాలు లేవు. కౌలు చట్టం అమల్లోకొస్తే రాతపూర్వక ఒప్పందాలు తప్పనిసరి కావాల్సిందే. కౌలు చేసే వారి పేర్లను భూ రికార్డుల్లో ఎక్కిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.
ధరణి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిమిషాల వ్యవధిలో జరుగుతున్నాయి. భూములకు సంబంధించిన కేసులు తగ్గుముఖం పట్టాయి. పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు వందల సంఖ్యలో భూ కేసులు నమోదయ్యేవి. రైతులు భూ సమస్యలపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లకుండా ధరణితో సమస్యలు, కేసులకు చెక్ పెట్టారు. ధరణిలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నది. ధరణి లాంటి మంచి కార్యక్రమాలను ఆహ్వానించాలి తప్ప.. బురదజల్లే ప్రయత్నం చేయొద్దు.
– పేర్ల కృష్ణకాంత్, హైకోర్టు న్యాయవాది, నకిరేకల్ మండలం
రైతులు సాగు పనులు మాని కోర్టుల చుట్టూ తిరుగాల్సి వస్తది
ధరణి పోర్టల్ రద్దుతోపాటు కౌలుదారు చట్టం తెస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ.. రైతుబంధును భూ యాజమానికో, కౌలురైతుకో ఇస్తామనడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ధరణి రైతులకు అనుకూలంగా, అనువుగా ఉన్నది. కాంగ్రెస్ నాయకులు చెప్తున్న కౌలుదారు చట్టం, రైతుబంధు ఇద్దరిలో ఒకరికే ఇస్తామనే విధానం భూ యజమానులకు, కౌలుదార్లకు మధ్య వివాదాలు, ఘర్షణలకు దారి తీస్తుంది. అసలు ఈ విధానం అమలుకు సాధ్యం కాదు. రైతులు, కౌలుదార్లు సాగు మానేసి కోర్టుల చుట్టూ తిరుగాల్సి వస్తది. భూ యాజమాని లీజు అగ్రిమెంటు ఎందుకు రాసిస్తాడు? రైతుకు ఇష్టం ఉన్నవారికి కౌలుకు ఇచ్చుకుంటాడు. ఏటా ఒకరికి కౌలుకు ఇస్తే రైతుబంధు ఎవరికి ఏ పద్ధతిన ఇస్తారు.
చట్టం తీసుకు రావాలంటే కేబినెట్ ఆమోదం పొందాలి. అది అమలు చేయాలంటే కౌలు రైతులు మారుతున్నప్పుడల్లా సర్వేలు చేయాలి. జాబితాలు తయారు చేయాలి. అది కాని పని. ఈ విధానం అమలు చేస్తే రైతులు కౌలుకు ఇవ్వడం మానేసి పొలాలను బీడుగా ఉంచుకుంటారు. రైతుబంధుతో సరిపెట్టుకుంటారు. ఫలితంగా కౌలు రైతులకు పనిదొరకక ఇబ్బందులు పడుతారు. క్రమంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకునే ప్రమాదం ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. సన్న, చిన్నకారు రైతులు సైతం ఎంతో ఆనందంతో ఉన్నారు.
– మహంకాళి రాజేశ్, న్యాయవాది, దామరచర్ల
కాంగ్రెస్ను నమ్మే రోజులు పోయినయి
రైతులు కాంగ్రెస్ నాయకుల మాటలను, వారి ప్రభుత్వాన్ని నమ్మే రోజులు పోయినయి. మళ్లీ రైతులను నమ్మించి మోసం చేయాలని చూస్తున్నరు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదు. కనీసం రైతు చనిపోతే ఆ కుటుంబం ఎలా ఉందని మందలిచే ప్రయత్నమైనా చేయలేదు. కాంగ్రెసోళ్లకు ఎన్నికలు వచ్చినప్పడే రైతులు గుర్తుకొస్తరు. నా ప్రాణం ఉన్నంత వరకు కరెంటు విషయంలో కాంగ్రెస్ను నమ్మను. కాంగ్రెస్ వచ్చేది లేదు. సచ్చేది లేదు. సీఎం కేసీఆర్తోనే 24 గంటల కరెంటు సాధ్యం. ఆయనకే మా మద్దతు.
-ధనావత్ లక్ష్మా, జటావత్తండా, మిర్యాలగూడ మండలం
కాంగ్రెస్వన్నీ మోసపూరిత హామీలే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూముల రేట్లు పూర్తిగా పడిపోతాయి. గత కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ భూములతోపాటు ప్లాట్ల ధరలు అంతంత మాత్రంగానే ఉండేది. రైతులు తమ భూమిని అమ్ముకోవాలంటే ఎకరానికి రెండు మూడు లక్షల కంటే ఎక్కువ ధర పలుకకపోయేది. వచ్చే ఆ డబ్బుతో అటు అప్పు తీరక, ఇటు పిల్లల పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి ఏర్పడేది. 2014లో స్వరాష్ట్రం వచ్చాక భూముల రేట్లు పెరిగి రైతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం జరిగింది.
ఎకరం భూమి తక్కువలో తక్కువ రూ.20లక్షలు.. మరీ ఎక్కువ అయితే రూ.50లక్షలు పలుకుతుంది. మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో ఎకరం భూమి రూ.కోటికి పైమాటే. కాంగ్రెస్ ఆరు మోసపూరిత హామీలతో రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పాలనలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక దళారులకు అడ్డికి పావుసేరు లెక్కన అమ్మాల్సిన పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంటలకు మద్దతు ధర లభించడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారు. రైతు సంక్షేమం కోరే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి.
– అంజిరెడ్డి, రైతు, తిరుమలగిరి (సాగర్)