రామగిరి, సెప్టెంబర్ 11 : తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని ప్రజాకవి కాళోజీ కోరినట్లు ప్రజల పలుకుబడుల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్తేజ తెలిపారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ విభాగం ఆధ్వర్యంలో ‘కాళోజీ జీవితం – సాహిత్యం’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర సాహిత్య సదస్సుకు ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. నేటి విద్యార్థులు, యువతరం కాళోజీని స్ఫూర్తిగా తీసుకుని సాహిత్యం, పరిశోధనల వైపు ఆలోచన చేయాలన్నారు. ప్రజలకు అవసరమైన మరిన్ని రచనలు చేసేలా చూడాలన్నారు. తన దైన శైలిలో కాళోజీ జీవిత అంశాలపై విద్యార్థులో ఆలోచన కల్పించేలా తెలంగాణ యాసలో నవరసాలతో కూడిన తాను రాసిన పాటలను పాడి సభలో నూతన ఒరవడితో రంజింప చేశారు.
ప్రముఖ కవి ఎన్.వీ.రఘువీర్ ప్రతాప్ మాట్లాడుతూ కాళోజీ ‘నా గొడవ – సామాజికత’ అను అంశంపై వివరించారు. కాళోజీ ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించి కవిత్వం రాశాడని, ప్రజల గొడవను తన గొడవగా భావించి కవిత్వం ద్వారా ప్రజలను ఆలోచింపచేశాడని తెలిపారు. ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్శ్యాం మాట్లాడుతూ కాళోజీ నిఖార్సైన మానవత్వానికి నిదర్శనమన్నారు. కళాశాల తెలుగుశాఖ అధిపతి డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ మునీర్, తెలుగు అధ్యాపకులు డాక్టర్ వీవీ సుబ్బారావు, డాక్టర్ ఎన్.దీపిక, లవేందర్రెడ్డి, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎ.దుర్గప్రసాద్ పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ మహిళ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలోప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్శ్యామ్, తెలుగు అధ్యాపకులు మహమ్మద్ హసేన, సునీత పాల్గొన్నారు.