కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు బేజారెత్తిస్తున్నాయి. ‘అచ్చే దిన్’ అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు ధరల పెరుగుదలకు ఊతమిస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వమూ పెంచని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో రవాణా రంగంపై పడుతున్న ప్రభావం ధరల పెరుగుదలకు కారణమవుతున్నది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఎప్పుడు, ఏ ధర ఉంటుందో చెప్పడం కూడా కష్టమే. వస్తువుల ధరలు విపరీతంగా పెరుగడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. వంట నూనె మొదలుకొని కూరగాయల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ధరల పెరుగుదలకు కారణమైన కేంద్రం విధానాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రూ.500 పట్టుకొని వెళ్తే వారం రోజులకు సరిపడే కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా వచ్చే కూరగాయల ధరలు ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగాయి. చిన్న కుటుంబాలు మినహాయిస్తే పెద్ద కుటుంబాలైతే రోజుకు రూ.200 కేవలం కూరగాయలకే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏ కూరగాయల ధర ఎప్పుడు, ఎంత పెరుగుతుందో తెలియక కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. వారంలో మూడు రోజులు మాత్రమే కూరగాయలు ఉపయోగిస్తూ మిగతా రోజులు పచ్చడి, చింత పులుసుతో కాలం వెల్లదీస్తున్నట్లు కొందరు వినియోగదారులు చెప్పకనే చెబుతున్నారు.
చికెన్ కిలో రూ.300…
ధరల పెరుగుదల జాబితాలో చికెన్ కూడా చేరింది. ఆదివారం, సెలవు దినాల్లో, బంధువులు వచ్చినప్పుడో తెచ్చుకునే చికెన్ ధర కూడా కొండెక్కింది. వేసవిలో తగ్గాల్సిన ధరలు అందుకు విరుద్ధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.280, స్కిన్ లెస్ రూ.300, బోన్లెస్ రూ.500 వరకు ధర పలుకుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల పెంపకం తగ్గడం చికెన్ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి…
మార్కెట్లో ఏ కూరగాయ ముట్టుకున్నా ధర భగ్గుమంటుంది. రూ.100 పట్టుకొని పోతే ఒక రోజుకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. మార్కెట్కు వెళ్లి రావడానికి ఆటో కిరాయికే 40రూపాయలు అవుతున్నాయి. అందుకే ఒకటే సారి వారం రోజులకు సరిపడా కూరగాయలు కొంటే రూ. 500 నుంచి 600వరకు ఖర్చవుతుంది. కనీసం ఆటో కిరాయి అయినా తప్పుతుంది.
– బచ్చు నీరజ, గృహిణి, సూర్యాపేట
25ఏండ్లలో ఎన్నడూ ఇంత ధర చూడలే…
నేను 25ఏండ్లుగా చికెన్ దుకాణం నడుపుతున్నా. ఇన్నేండ్లలో ఎన్నడూ కూడా ధరలు ఇంతగా పెరుగడం చూడలేదు. కరోనా సమయంలో అతిగా చికెన్ వాడకం ఉన్నప్పటికీ రేటు పెరిగిన దాఖలాల్లేవు. ఎండాకాలంలో చికెన్ ధరలు తగ్గుతుంటాయి కానీ, ఈ సారి కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో పౌల్ట్రీ నుంచి ధరలు పెంచారు. ఇది ఒక రకంగా మాకు నష్టమే. కోడిలో వేస్టేజ్ ఎక్కువ. వేస్టేజ్ పోను చికెన్ అమ్మాలంటే ధరలు పెంచక తప్పడం లేదు. ధరలు పెరిగినంత మాత్రాన మాకేమీ రాదు. మాకు వచ్చే లాభం వేస్టేజ్ మీదనే పోతుంది.
– జంగాల అనంత్, చికెన్ వ్యాపారి, సూర్యాపేట
సూర్యాపేట మార్కెట్లో కూరగాయల ధరలు (కిలో)
చికెన్ (కిలో)