Telangana | గుండ్రంగా, నునుపుగా, వివిధ రంగుల్లో కనిపించే రాళ్లు కృష్ణానది తీరంలో మాత్రమే లభ్యమవుతాయి. వీటిని గృహ నిర్మాణంలో సుందరీకరణకు ఉపయోగిస్తారు. ఈ రాళ్లకు డిమాండ్ ఉండడంతో కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా అడవిదేవులపల్లి మండలంలోని ముదిమాణిక్యం సమీపంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అడవిదేవులపల్లి, మార్చి 13 : మండలంలోని కృష్ణానది తీరంలో గుండ్రాళ్ల(రంగురాళ్ల) దందా జోరుగా కొనసాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇంటి నిర్మాణంలో సుందరీకరణకు ఉపయోగిస్తుండడంతో ఈ రాళ్లకు మంచి డిమాండ్ ఉంది. దాంతో మండలంలోని ముదిమాణిక్యం కృష్ణానది సమీపంలో కొన్నేండ్లుగా కూలీల ద్వారా గుండ్రాళ్లను రవాణా చేస్తూ కోట్ల రూపాయలను గడిస్తున్నారు. ఎక్కడ దొరుకని విధంగా గుండ్రని, నునుపు గల గుండ్రాళ్లు మండలంలోని కృష్ణానది సమీపంలో దొరుకుతుండడం అక్రమార్కులకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వారి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
టన్ను గుండ్రాళ్ల ధర సుమారు రూ.4 నుంచి రూ.5 వేల వరకు పలుకుతుండడంతో కృష్ణానది తీరంలో కూలీల ద్వారా గుండ్రాళ్లను సేకరించి ట్రాక్టర్ల ద్వారా ముదిమాణిక్యం గ్రామ శివారులో డంప్ చేస్తున్నారు. అనంతరం వాటిని గ్రేడింగ్ చేస్తారు. వారం, పది రోజుల తరువాత లారీల్లో లోడ్ చేసి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ర్టాలకు రవాణా చేస్తుంటారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని కృష్ణానది తీరంలో నిఘా పెంచి ఖనిజ సంపద తరలిపోకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
గతంలో పట్టుబడిన వాహనాలపై జరిమానా విధించాం. గుండ్రాళ్లను డంప్ చేసే స్థావరాలను గుర్తించినప్పుడు ఆ స్థలానికి పట్టాదారులు ఎవరూ లేకపోవడంతో అటవీ శాఖకు సంబంధించినదని గుర్తించాం. అటవీ అధికారులకు తెలిపితే వారి నుంచి స్పందన లేదు. దందా జరుగకుండా మా వంతు చర్యలు తీసుకుంటున్నాం.
నాలుగేండ్లుగా కొందరు గుండ్రాళ్ల దందా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వారి ఆట కట్టించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. దాంతో అక్రమార్కులు ఇదే అదునుగా భావించి యథేచ్ఛగా గుండ్రాళ్లను తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– ఏడుదుల హనుమంతరావు (ముదిమాణిక్యం)