సూర్యాపేట, మార్చి 20 : పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మీడియా సహకారం ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నా రు. సూర్యాపేట కలెక్టరేట్లో బుధవారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మీడియా సెంటర్ను ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉందన్నారు. ఎంపీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తిస్తారని, వాటిని నిర్ధారణ చేస్తూ సంబంధిత అధికారి అభ్యర్థి ఖర్చులో వేస్తారని తెలిపారు.
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల ప్రకటనలు సకాలంలో ఆమోదించాలని అధికారులకు సూచించారు. శాటిలైట్ చానెల్స్లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని ఆదేశించారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్లు, టెలివిజన్ చానెల్లు, స్థానిక కేబుల్ నెట్వర్క్లు, సోషల్ మీడియా, మూవీ హౌస్లు, సంక్షిప్త సందేశాలు, ఆడియో, వీడియో విజువల్ మీడియాల ప్రకటనలను ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులకు సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ప్రకటనలు ప్రసారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొని మాట్లాడారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలని, డిజిటల్, బ్యాంకు లావాదేవీలు బ్యాంకర్లు దృష్టి పెట్టాని తెలిపారు. బ్యాంకు అధికారులు ప్రతి రోజూ నివేదికలు అందచేయాలని, తనిఖీల సందర్భంగా పట్టుకున్న నగదుకు రసీదులను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమంగా రవాణా చేస్తే లిక్కర్తోపాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, జడ్పీ సీఈఓ అప్పారావు, డీపీఆర్ఓ రమేశ్కుమార్, ఎక్సైజ్ పర్యవేక్షకులు లక్ష్మనాయక్, డీఎఫ్ఓ సతీశ్కుమార్, డీఐఈ మల్లేశం, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.