సూర్యాపేట, మార్చి 26 : లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పీఓ, ఏపీఓల మొదటి ర్యాండమైజేషన్ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పీఓ, ఏపీఓలను విభజించామని, ఎన్నికల నిర్వహణ, విధివిధానాలపై మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 5,664 మంది సిబ్బందిని ఎంపిక చేశామని, ర్యాండమైజేషన్ మరో రెండు దఫాలు నిర్వహిస్తామని చెప్పారు. పీఓలు, ఏపీఓలు తప్పకుండా శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు, శ్రీనివాస్రాజు, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండ : కలెక్టరేట్లో మంగళవారం నల్లగొండ పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన నిర్వహించారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించే పీఓ, ఏపీఓ, ఓపీఓ ర్యాండమైజేషన్ను పూర్తి చేశారు. రిజర్వ్ సిబ్బందిని కలుపుకొని జిల్లా పరిధిలో మొత్తం 9,490 మంది పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ జరిపారు.
వీరిలో 2,368 పీఓలు, 2,377 మంది ఏపీఓలు, 4,745 మంది ఓపీఓలు ఉన్నారు. ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో మాస్టర్ ట్రైనర్స్ పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరుగతులు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి గణపతిరావు, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఆర్డీఏ నాగిరెడ్డి, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.