సూర్యాపేట, మార్చి 16 : ఎన్నికల కోడ్ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ తేదీలు వెలువడిన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 13న జిల్లాలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా మూడు నియోజకవర్గాలు నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఉంటే తుంగతుర్తి నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,201 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటి పరిధిలో 9,96,493 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. 40 శాతంకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారి ఇంటికే వచ్చి ఓటు నమోదు చేయించడం జరుగుతుందని వెల్లడించారు.
ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. పూర్తి బందోబస్తుతో ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వెపన్స్ రిటన్ తీసుకోవడం, రౌడీషీటర్స్ను బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో 24 గంటల పాటు తనిఖీలు చేస్తున్నామని అందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండు కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు వచ్చాయని వారి ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లత, డీఈఓ అశోక్ పాల్గొన్నారు.