సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 15 : జిల్లాలోని 584 అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సూర్యాపేట పట్టణ పరిధి బాషానాయక్తండాలోని మండల పరిషత్ పాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులను సోమవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని గుర్తించబడిన 584 ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం వసతుల కల్పన కోసం తాగునీరు, విద్యుత్, బాలికల టాయిలెట్స్ సుందరీకరణ పనులు చేపట్టిందని తెలిపారు.
576 పాఠశాలలో కమిటీలు ఏర్పాటు చేశామని, 555 పాఠశాలల కమిటీలు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాయని, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం పిల్లలమర్రి గ్రామంలో పీఏసీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తేమ శాతం యంత్రం ద్వారా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులు ఆరబెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న రైతులు ఐరిష్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట మున్సిపల్ డీఈ ప్రసాద్, పీఏసీఎస్ అధికారులు వెంకట్రెడ్డి, వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.