సూర్యాపేట, ఫిబ్రవరి 19 : ఈ నెల 28 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే పరీక్షలకు ఆటంకాలు కలుగకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలోని 77 కళాశాలల్లో 16,602 మంది విద్యార్థులు ఉండగా, పరీక్షల కోసం 32 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాలను 9 జోన్లుగా విభజించామని, పరీక్షల నిర్వహణ కోసం ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 3 టీమ్ల సిట్టింగ్ స్క్వాడ్స్, 850 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్షలో జడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీఈసీ సభ్యులు లక్ష్మయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.