చివ్వెంల, జనవరి 31 : అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని బీబీగూడెంలో గల అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలతో కాసేపు గడిపారు. బోర్డుపై రాసిన పదాలను పిల్లలతో చదివించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు కంఠస్థ పద్యాలు చక్కగా చెప్పడంతో అభినందించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆట, పాటలతో ప్రాథమిక విద్య నేర్పాలని, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఈ విషయమై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ రంగారావు, అంగన్వాడీ సూపర్వైజర్ అంజలీనా, టీచర్లు, సిబ్బంది ఉన్నారు.