సూర్యాపేట, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నికల విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎలాంటి ఎన్నికలు జరిగినా పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రధానంగా గత ఎన్నికల నుంచి టెక్నాలజీ వినియోగం పెరుగుతుండడంతో ట్రాన్స్ఫరెన్సీ పెరుగుతుంది. ప్రజలు, రాజకీయ పార్టీలకు ఎలాంటి అనుమానాలు ఉండకుండా నివృత్తి అవుతుండగా అధికారులు, సిబ్బందికి కొంత మేర భారం తగ్గుతుంది. ఎన్నికలంటే ఓ పెద్ద ప్రహసనమే. సాధారణ పౌరుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇలా అన్ని వర్గాల వారికి ఏదో ఒక రకంగా చేతి నిండా పని ఉంటుంది.
ప్రధానంగా ఎన్నికల కమిషన్కు కత్తిమీది సాము అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఏ రాజకీయ పార్టీకి కూడా కించిత్ అనుమానాలు లేకుండా అన్నింటినీ నివృత్తి చేస్తూ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఏటేటా టెక్నాలజీని పెంచుతూ వస్తున్నది. గతంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఎలక్టోరల్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఆర్ఎంఎస్) రాష్ట్ర పరిధిలో ఉండగా గతేడాది నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) నెట్ పేర జాతీయ స్థాయిలో సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. దాంతో దేశంలో ఎక్కడ ఉన్నా ఓటు నమోదు చేసుకునే అవకాశం వచ్చింది.
ఎన్నికల బరిలో నిల్చునే అభ్యర్థుల పూర్తి వివరాలు, అఫిడవిట్, కేసుల వివరాలు, వారికి ప్రతిపాదించే సాక్షులతోపాటు అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపర్చుతారు. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణలో ఉండే అధికారి మొదలుకొని ప్రతి ఒక్క ఆఫీసర్, సిబ్బంది వివరాలను ఆన్లైన్లో ఉంచుతున్నారు. అన్నింటికన్నా అత్యంత ప్రధానమైనది అనేక అనుమానాలకు తావిచ్చేది, పలు ఆరోపణలు వచ్చేది ఈవీఎంలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడుతుందనేది. ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ వీవీ ప్యాట్లను తీసుకొచ్చారు. ఓటు వేసిన వెంటనే తాము ఎవరికి ఓటు వేసింది ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. దీంతో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా.. రాకుండా పోయాయి. మొత్తం మీద ఎన్నికల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తూ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తుండడంతో పారదర్శకత పెరిగింది.
ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ విధానంతో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఎన్నికల కమిషన్.. దానిని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నది. పోస్టల్ బ్యాలెట్ స్థానంలో స్పాట్ బాలెట్ విధానం ప్రవేశపెట్టింది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ చివరి ట్రైనింగ్ రోజున అక్కడే బ్యాలెట్ పొంది అక్కడే బాక్స్లో వేయాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు గతంలో అనేక సార్లు రాజకీయ నాయకుల చేతిలో కట్టలు కట్టలుగా ఉండగా ఈ సారి ఆ అక్రమానికి చెక్ పడనుంది.
ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగంతో రాజకీయ పార్టీలు, ప్రజల్లో ట్రాన్స్ఫరెన్సీ పెరుగుతుంది. అధికారులు బిజీగా ఉన్నా రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలతో పాటు ఇతరులు ఎలాంటి సమాచారం కావాలన్నా ఆన్లైన్లో పొందవచ్చు. దీంతో ఎన్నికల నిర్వహణ సులభతరంగా ఉంటుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే కాదు.. ఫలితాల కోసం కౌంటింగ్ సెంటర్ వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వెబ్సైట్ ద్వారా క్షణాల్లోనే ఆన్లైన్లో చూసుకోవచ్చు.
– ఎస్.వెంకట్రావు, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి