బీబీనగర్, మార్చ్ 2 : ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని అన్నంపట్ల గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం, సుకన్య సమృద్ధి యోజన, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవగాహన సమావేశంలో మాట్లాడారు. గ్రామాలు పంచాయతీలు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలను అమలు చేస్తూ స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రజలందరూ టాయిలెట్స్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
అలాగే భూగర్భ జలాల పెంపుదలకు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా (సోక్ పిట్) ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల కింద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి పైలెట్ ప్రాజెక్టుగా 30 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా అన్నెంపట్ల గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో జిల్లాలో ప్లాస్టిక్ రహిత చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో అర్హత కలిగిన 53 మంది పిల్లలకు ఖాతాలు పూర్తిచేసి మండలంలోనే అన్నెంపట్ల గ్రామం మొదటి స్థానంలో నిలిచినందుకు గ్రామ సర్పంచ్కు, పంచాయతీకి కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం సర్పంచ్ బి.వసుమతి ఏర్పాటు చేసిన 200 స్టీల్ ప్లేట్లు, బాటిల్స్, మగ్గులను కలెక్టర్ గ్రామ సమాఖ్య మండలికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు వై.సుధాకర్గౌడ్, జడ్పీటీసీ జి.ప్రణీతాపింగళ్రెడ్డి, తాసీల్దార్ అశోక్రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శ్రీవాణి, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ జైపాల్రెడ్డి, మండల పంచాయతీ అధికారి మజీద్, బీబీనగర్ మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు, స్వచ్ఛభారత్ టీమ్ సభ్యులు నాగబాబు, మురళి పాల్గొన్నారు.