నీలగిరి, మే 25 : జూన్ 5నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఐదో విడుత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో గురువారం నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశంలో నియమ నిబంధనలు, ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ఐదు విడుతలుగా నిర్వహించిన వేలం తర్వాత మిగిలిన 59ఓపెన్ ప్లాట్లు, 209పాక్షిక నిర్మాణ గృహాలకు భౌతిక వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఓపెన్ ప్లాట్లకు చదరపు గజానికి రూ.6వేలు, పాక్షిక నిర్మాణ గృహాలకు గృహ నిర్మాణ దశలు అనుసరించి చదరపు గజానికి రూ.6వేలు నుంచి రూ.10,500 అప్సెట్(కనిష్ఠ) ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అరుదైన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భౌతిక వేలంలో పాల్గొనే వారు రూ.10వేల ఈఎండీ కలెక్టర్ పేరున చెల్లించి వేలంలో పాల్గొన వచ్చునని తెలిపారు. వివరాలకు ప్రాజెక్టు కోఆర్డినేటర్ సయ్యద్ షఫీ(915 4339209) నంబర్ను సంప్రదించాలని సూచించారు.