నీలగిరి, మార్చి12 : లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒకరూ కృషి చేయాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి మహిళ ముందుకు రావాలన్నారు.
పిల్లలను పెంచడంలో వ్యత్యాసం చూపించవద్దని, ఆడైనా, మగైనా ఒకటేనని తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు విద్య అందించాలని, ప్రత్యేకించి బాలికలు తప్పనిసరిగా చదువుకునేలా చేయాలని, అప్పుడే వివక్ష లేని సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్ కంకణాల ప్రవీణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సక్కుబాయి, పగిళ్ల వేణు, సీడీపీఓ తూముల నిర్మల, ఐసీడీఎస్ అధికారులు, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.