నల్లగొండ, ఏప్రిల్ 5: ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వేడిమి సంబంధ వ్యాధులపై జిల్లా స్థాయి టాస్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇప్పుడే 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతున్న నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే ప్రజలు బయటికి వెళ్లినప్పుడు శరీరం ఎండ వేడిమి తగలకుండా టోపీ ధరించాలని శరీరం నుంచి చెమట ఎకువగా పోవడం, వాంతులు, విరేచనాలు వంటివి సంభవిస్తే తక్షణమే ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేసే వారి కోసం తాగునీరు నీడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోక సభ ఎన్నికలు మే నెలలో నిర్వహిస్తున్నందున ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలు ఉష్ణోగ్రతల కారణంగా ఇబ్బందులు పడకుండా టెంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అందరూ వారి వారి పరిధిలోని సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి పిల్లలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన తీసుకురావాలన్నారు. అంతకుముందు డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు మాట్లాడుతూ వడదెబ్బకు గురైన వారికి ప్రథమ చికిత్సగా ఇచ్చేందుకు ప్రతి ఆశ వరర్ దగ్గర 50, ఏఎన్ఎం వద్ద 100, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో2000 ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ టి. పూర్ణచందర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఆర్ఓ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.