నల్లగొండ, ఫిబ్రవరి 23 : లక్ష్య సాధనకు అంకితభావంతో కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల లక్ష్యంతోపాటు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన పదో తరగతి ప్రేరణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తన బలాన్ని బలహీనతలను విశ్లేషణ చేసుకోవాలని, పరీక్షల్లో మంచి మారులు ఎలా సాధించాలో ఆలోచించాలని సూచించారు.
ప్రతి విద్యార్థి తన సామర్థ్యంతోపాటు సబ్జెక్టు విషయాన్ని సైతం అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇందుకు ఏ విషయంలో వెనుకబడి ఉన్నారో దానిపై దృష్టి సారించి ముందుకెళ్లాలని సూచించారు. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను పరస్పరం చర్చించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, ఇన్చార్జి డీటీడబ్ల్యూఓ రాజ్కుమార్, ఏటీడబ్ల్యూఓ లక్ష్మిరెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి రామకృష్ణ, ప్రిన్సిపాల్ హనుమాక్షి పాల్గొన్నారు.