నల్లగొండ, జనవరి 20: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 116, 117, కాకతీయ డిగ్రీ కళాశాలలో 115 పోలింగ్ కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సలు నిండిన యువతీ, యువకులను ఓటర్లుగా నమోదుచేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో పాటు ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఆమె వెంట ఆర్డీఓ రవి, తాసీల్దార్ శ్రీనివాస్, బీఎల్ఓలు ఉన్నారు.
నార్కట్పల్లి : ఓటరు నమోదుతో పాటు జాబితాలో సవరణలను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. శనివారం మండలంలోని ఎల్లారెడ్డిగూడెం, నార్కట్పల్లి, మాధఎడవల్లి గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక క్యాంపెయిన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ నెల 6న విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు 22 వరకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎంపీడీఓ యాదగిరి, తాసీల్దార్ పద్మ, బూత్లెవల్ అధికారులు ఉన్నారు.
మునుగోడు : ఓటరు నమోదు కోసం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపెయిన్ను వినియోగించుకోవాలని చండూరు ఆర్డీఓ కె.దామోదర్రావు సూచించారు. మండల కేంద్రంలోని 156, 157, 158, 159, 160, 163తో పాటు సింగారంలోని 133 పోలింగ్బూత్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త వారి ఓటు హక్కు నమోదుతో పాటు గ్రామాల్లో లేకుండా పోయిన వారు, మృతి చెందిన వారి వివరాలను సేకరించి వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించాలని బీఎల్ఓలకు సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ నరేందర్, డీటీ నేలపట్ల నరేశ్, ఆర్ఐ నాగరాజు, సీనియర్ అస్టింట్ ప్రసాద్రెడ్డి, బీఎల్ఓలు ఉన్నారు.