నల్లగొండ, మార్చి 26 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గానూ జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రావచ్చని అంచనా వేసినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసఫరాలు, మిషన్ భగీరథ అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తాగునీటిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన జిల్లా అంశాలపై మాట్లాడారు. జిల్లాలో 175 ఐకేపీ కేంద్రాలు, 180 పీఏసీఏస్, 15 రైతు ఉత్పత్తిదారుల కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27న ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలకు శిక్షణ ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు, ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు, తూకం యంత్రాలు, అవసరమైన గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన నిర్వహణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. రానున్న 10 రోజులపాటు ప్రతిరోజూ మండల స్థాయి అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ లేదా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు పూర్ణచందర్, శ్రీనివాస్, సివిల్ సప్లయ్ డీఎం నాగేశ్వర్రావు, డీఏస్ఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ నాగిరెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీపీఓ మురళి, ఏస్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.