నీలగిరి, మే15 : నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో 74.03 శాతం పోలింగ్ నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరో 2 శాతం నమోదైనట్లు తెలిపారు.7 నియోజకవర్గాల నుంచి ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూముల్లో భద్రపరిచామని, అక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు.
ఓట్ల లెకింపు జూన్ 4న ఉంటుందని తెలిపారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టపద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ పరిధి 12 జిల్లాల్లో ఉందని, 12 మంది అదనపు కలెక్టర్లు ఏఆర్ఓలుగా ఉన్నారని, పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టుకోవచ్చని, అందుకు సంబంధించి అనుమతులు జిల్లా స్థాయిలోనైతే ఏఆర్ఓల వద్ద, మొత్తం నియోజకవర్గమైతే నల్లగొండలోని ఆర్ఓ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పార్లమెంట్ ఎన్నికల లాగానే ఉంటుందని, అభ్యర్థులు ఏవైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఎంసీఎంసీ వద్ద ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలన్నారు. ఈ నెల 27న పోలింగ్ ఉంటుందని, నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అకడి నుంచే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల పంపిణీ ఉంటుందని తెలిపారు. పోలింగ్ అనంతరం 12 జిల్లాలకు చెందిన బ్యాలెట్ బాక్స్లను నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లకు తరలించనున్నట్లు చెప్పారు. జూన్ 5న కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. సమావేశంలో మీడియా సహాయ సంచాలకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.