– నల్గొండ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’
రామగిరి, జూలై 15 : మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో ముందుకు సాగాలని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ జి.రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ (సీబీసీ) ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీబీసీ సహాయ సంచాలకులు జి.కోటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు అదనపు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత, విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, చదువుతో పాటు క్రీడల్లో రాణించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. వ్యసనాల బారిన పడిన వారికి అండగా నిలిచి, వారిని తిరిగి సమాజంలో కలుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఈగల్ ఫోర్స్ డీఎస్పీ శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు, ప్రజల్లో అవగాహన, వ్యసనపరులకు పునరావాసం కల్పించడమే ‘నషా ముక్త్ భారత్’ ప్రధాన లక్ష్యాలని వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నెట్వర్క్ను కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచారని, ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1908 ద్వారా సమాచారం అందించాలని కోరారు. విద్యార్థులు ఈగల్ ఫోర్స్లో వాలంటీర్లుగా చేరి డ్రగ్ ఫ్రీ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.
నెహ్రూ యువ కేంద్రం (మై భారత్) జిల్లా అధికారి ఎం.గౌతం రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు ఇక్కడ తెలుసుకున్న విషయాలను సమాజంలోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు అదనపు ఎస్పీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. అనంతరం పోలీసు కళాజాత, యక్షగాన బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల బోధనా సిబ్బంది విద్యాసాగర్, అజయ్, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మాదకద్రవ్య రహిత సమాజానికి సమష్టి కృషి అవసరం : అదనపు ఎస్పీ జి.రమేష్