యాదగిరిగుట్ట, మార్చి 11 : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఉత్తి చేతులు చూపి వెనుదిరిగారు. గంటన్నరకు పైగా స్వామివారి క్షేత్రంలో గడిపిన ముఖ్యమంత్రి స్వామివారి క్షేత్రం అభివృద్ధిపై ఒక్క ప్రకటన అయినా చేయలేదు. కొండపైకి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహాద్భుతంగా రూపుదిద్దుకున్న ఆలయాన్ని చూస్తుండి పోయారు. భక్తుల సౌకర్యార్థ్యం మరిన్ని నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని, వసతులు కల్పించాల్సి ఉందని సీఎం దృష్టికి ఆలయ అధికారులు, అర్చకులు తీసుకెళ్లారు. స్వామివారి విమాన గోపురం స్వర్ణమయం చేసే విషయాన్ని ప్రస్తావించినా.. ‘నేను మాట్లాడుతా..’ అంటూ దాటవేశారు.
దళిత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు యాదగిరి నర్సన్న సాక్షిగా తీవ్ర అవమానం జరిగింది. వేద ఆశీర్వచనం ఇచ్చే సమయంలో సీఎం రేవంత్రెడ్డి దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఎత్తుగా ఉన్న సీట్లపై కూర్చోగా.. భట్టి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఎత్తు తక్కువగా ఉన్న కుర్చీ మీద కూర్చోబెట్టి అవమాన పర్చారు. దీనిపై ఆలయ ఈఓ రామకృష్ణారావు స్పందిస్తూ డిప్యూటీ సీఎంకు కుర్చీ వేయలేదని చెప్పడం సరికాదన్నారు. విషయాన్ని రాజకీయం చేయొద్దన్నారు. అంతకుముందు కొండ పైకి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు మరో మంత్రి కొండా సురేఖ రాక కోసం మాఢవీధుల్లో 10 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చింది.
బేగంపేట విమానాశ్రమం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:03 గంటలకు కొండ కింద గల హెలిప్యాడ్ వద్దకు సీఎం రేవంత్రెడ్డి దంపతులు, మంత్రులు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లి 10 :27 గంటలకు కొండపైకి రోడ్డుమార్గం గుండా బయల్దేరారు. 10:40 గంటలకు ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. వివిధ పూజల అనంతరం 11:26 గంటలకు పశ్చిమ పంచతల రాజగోపురం గుండా బయటకు వచ్చి అద్దాల మండపం వద్ద స్వామివారి ప్రసాదం స్వీకరించారు. తిరిగి ఉత్తర ద్వారం గుండా మాఢవీధుల్లోకి వచ్చారు. అక్కడి నుంచి సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి హెలికాప్టర్లో భద్రాచలం వెళ్లారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, రాచకొండ సీపీ తరుణ్జోషి, డీసీపీ రాజేశ్చంద్ర, ఏసీపీ రమేశ్కుమార్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్టపై సీఎం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు హంగామా చేశారు. సీఎంతోపాటు మంత్రులు కొండపైకి చేరుకున్నాక తమ దగ్గరున్న జాబితాలో పేర్లున్న వారిని పోలీసులు ఆలయంలోకి పంపించారు. కాగా, తమను కూడా లోపలికి అనుమతించాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆలయం ముందు హల్చల్ చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీస్ జులుం నశించాలి.. వీ వాంట్ జస్టిస్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ‘మాది కాంగ్రెస్ పార్టీ.. మా సీఎం రేవంత్రెడ్డిని కలువడానికి మీ అనుమతి ఎందుకు’ అంటూ ప్రశ్నించారు. దాంతో చేసేదిలేక కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, భువనగిరి మున్సిపల్ చైర్మన్, ఎంపీపీని పోలీసులు ఆలయంలోని అనుమతించారు.