రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, స్వరాష్ట్రంలో సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతాంగ పోరాటాలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కదిలించాయని, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడానికి అదే ప్రధాన కారణమని తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలక వర్గం మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సహకార బంధువుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి శరణ్యమని అన్ని వర్గాలు గుర్తించాయన్నారు. మోదీ సర్కారు 24 గంటల కరంట్ సరఫరాకు మోకాలడ్డుతున్నా నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. గతంలో కరువు జిల్లాగా పేరున్న నల్లగొండ నేడు వరి దిగుబడిలో రికార్డ్ సృష్టించిందని, భూగర్భ జలాలు పెరుగడం, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు పుష్కలంగా రావడంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రైతాంగ రక్షణకు పాటుప
డుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మున్ముందు బాసటగా నిలువాలని రైతులను కోరారు. డీసీసీబీ మూడేండ్లలో రూ.2,200 కోట్ల టర్నోవర్ సాధించడం మంచి పరిణామమని, రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని మంత్రి అభినందించారు.
నల్లగొండ, మార్చి 24 : స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం సాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రైతాంగాన్ని పరిరక్షించేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని పేర్కొన్నారు. దేశోద్ధారణకు ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్కు యావత్ తెలంగాణ బాసటగా నిలవాలని కోరారు. డీసీసీబీ చైర్మన్, పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసి మూడేండ్లు పూర్తైన సందర్భంగా చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండలో శుక్రవారం నిర్వహించిన సహకార బంధువుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీశ్రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టు వదలని విక్రమారుడు సీఎం కేసీఆర్ అని, రాష్ర్టాన్ని ఏ విధంగా సాధించాడో అదే ైస్థెర్యంతో హస్తినకు బయల్దేరాడని తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థిల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి శరణ్యమని అన్ని వర్గాలు గుర్తించాయన్నారు. విద్యుత్ సరఫరా నియంత్రణకు ప్రధాని మోదీ సరార్ మోకాలడ్డుతున్నా తెలంగాణలో వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలను చేధించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్దని కొనియాడారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు చూసి మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్ రాష్ర్టాల రైతులు సీఎం కేసీఆర్ను కలిసి దేశాభివృద్ధికి కదిలి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో నల్లగొండ జిల్లా అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. కరువు జిల్లాగా పేరుగాంచిన నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం రికార్డు స్థాయిలో వరి దిగుబడులు రావడమే నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రైతులు వరిపై గాక ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. ప్రతి రైతు ఎకరా భూమిలో కనీసం లక్ష రూపాయల ఆదాయం సంపాదించాలనేది సీఎం కేసీఆర్ కోరిక అని పేర్కొన్నారు. ఆ దిశగా వ్యవసాయం అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. సీఎం కేసీఆర్ వెంటే నాడు ఉద్యమంలో 2014, 2018లో నడిచిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం మున్ముందు సైతం బాసటగా నిలవాలని కోరారు. రైతు సంక్షేమానికి పాటుపడుతూ నల్లగొండ డీసీసీబీ మూడేండ్లలో రూ.900కోట్ల నుంచి రూ.2200 కోట్ల టర్నోవర్కు వెళ్లడం సంతోషకరమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు తిప్పన విజయసింహారెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్యయాదవ్, డీఎల్డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య చైర్మన్ శ్రీకర్రెడ్డి,ఆపాబ్ మాజీ చైర్మన్ విజయేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మోతె సోమిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు రజాక్, అమరేందర్, డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసీరెడ్డి దయాకర్రెడ్డి, సీఈఓ మదన్మోహన్, డీసీసీబీ డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు.
రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నల్లగొండ డీసీసీబీ పాలకవర్గం మూడేండ్లుగా చిత్త శుద్ధితో పనిచేస్తున్నదని సహకార అపెక్స్ బ్యాంకు రాష్ట్ర చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. దీంతో పాటు కమర్షియల్ రుణాలు, డిపాజిట్ల సేకరణ, విద్యా రుణాలు ఇవ్వడంతో బ్యాంకు ఆర్థిక ప్రగతి అనతి కాలంలోనే బాగా పెరిగిందని తెలిపారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎన్డీసీసీబీ నేడు రూ.2200కోట్ల టర్నోవర్ సాధించడమంటే ఇందులో అందరి కృషి ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు, పాలకవర్గం సమిష్టిగా పనిచేసి మరింత ప్రగతి సాధించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి డీసీసీబీల అభివృద్ధికి ప్రోత్సాహం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
– అపెక్స్ చైర్మన్ కొండూరు రవీందర్రావు
ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎన్డీసీసీబీ మూడేండ్లలో 2200కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం శుభ పరిణామమని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని నాబార్డుతో అధిక రుణాలు ఇప్పించడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని తెలిపారు. ఈ ఆర్థిక ప్రగతిలో ఉద్యోగుల పాత్ర చాలా గొప్పదని, అందరి సమష్టి కృషి వల్లే ఇది జరిగినట్లు తెలిపారు. రైతు సంక్షేమం దృష్ట్యా రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పని చేసి రాష్ట్రంలో తొలిస్థానం సాధించేలా కృషి చేయాలని కోరారు.
– మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు
వందేండ్లలో డీసీసీబీ రూ.900కోట్ల టర్నోవర్ సాధిస్తే ఈ మూడేండ్లలో రూ.2,200కోట్లకు పెరిగిందని చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఈ మూడేండ్లలో రూ.1,300కోట్ల టర్నోవర్ పెంచినట్లు తెలిపారు. పాలకవర్గంతో పాటు బ్యాంకు సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వాలు సహకార బ్యాంకులు, రైతులను చిన్న చూపు చూడటం వల్ల పురోగతి ఆగిపోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ స్వయానా రైతు కావడం వల్ల ఈ బ్యాంకులు ప్రగతి పథంలో నడుస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మూడేండ్లలో లాభాలు సైతం రూ.65కోట్లు సాధించినట్లు తెలిపారు. నిరర్దక ఆస్తుల శాతం 6.55శాతం నుంచి 2శాతానికి తగ్గించి రాష్ట్రంలోనే కరీనంగర్ తర్వాత నల్లగొండ రెండో స్థానాన్ని సాధించామని తెలిపారు.
– డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి
నష్టాల్లో ఉన్న ఎన్డీసీసీబీ మూడేండ్లలో ఇంత ఆర్థిక ప్రగతి సాధించడానికి అందరి సమష్టి కృషే కారణమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ సహకారం సైతం ఈ విజయానికి సోపానంగా పేర్కొన్నారు. ఒకప్పుడు పీఏసీఎస్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉండేదని, అలాంటిది ప్రస్తుతం ప్రతి పీఏసీఎస్ ఉద్యోగికి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించిందన్నారు. ఉద్యోగులు, పాలకవర్గం ఇదే ఉత్సాహంతో ముందకు సాగి రాబోయే రోజుల్లో మరింత ప్రగతి సాధించాలని ఆకాక్షించారు.
– ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి