దేవరకొండ రూరల్, జనవరి 14 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన గోదారంగనాథుల తిరు కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ యాదాద్రి ఆలయాన్ని ఎవరూ ఊహించని రీతిలో పునర్నిర్మించారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని చెప్పారు. దేవరకొండ ప్రాంతంలోని ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుందని తెలిపారు. గరుడాద్రి ఆలయానికి రూ.8 కోట్లు కావాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు శాసన మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డిని, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్నాయక్, యామ దయాకర్, టీవీఎన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.