నల్లగొండ, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్ కారణజన్ముడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా దేశం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ర్టాల ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ను స్థాపించి మరో పోరుకు సిద్ధమైన సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అంతకుముందు మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు.
వేడుకలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు ఎన్నో అవమానాలు పడ్డ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించాక నాలుగున్నరేండ్లలోనే అందరి అనుమానాలు పటాపంచలు చేసి అన్ని రంగాల్లో తెలంగాణను ముందుంచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించగానే తన పని పూర్తయిందనుకోకుండా దేశాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ను స్థాపించి మరో పోరుకు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ సాధించాక కేసీఆర్ సీఎం కావాలని ఎన్నడూ అనుకోలేదని రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి తెలిసినందును తనే సీఎంగా ఉండాలని మేధావుల నుంచి విజ్ఞప్తుల మేరకు పదవి చేపట్టారని తెలిపారు.
అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దారన్నారు. ప్రస్తుతం తెలంగాణ మాదిరిగా తమ రాష్ట్రం అభివృద్ధి చేయాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. ఉద్యమంలో చెప్పిన, మేనిఫెస్టోలో పెట్టిన వాటి కంటే అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ అన్నం కోసం అలమటించడం లేకపోగా దేశంలో మాత్రం 35శాతం మంది అన్నం కోసం అలమటిస్తూ అనేక వేల మంది ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రజల ఆకలి ఎలా తీరిందో దేశం మొత్తం మీద తీరాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో సరైన నాయకత్వం లేకనే బంగ్లాదేశ్ కంటే దారుణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపారు.
అనేక వనరులు ఉన్నా వాటిని సక్రమంగా వినయోగించక ఈ దేశం అన్ని రంగాల్లోనూ వెనుకబడ్డట్టు తెలిపారు. ఈ పరిస్థితులు మారాలంటే కొత్త లక్ష్యం, కొత్త ఎజెండా అవసరమని దానికి సీఎం కేసీఆరే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు సేవే ప్రధానమని, ఆయన పుట్టిన రోజు సందర్భంగా 800మంది కార్యకర్తలు రక్తదానం చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు పండుగలా జరుపుకొంటున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో ఎవరి సమస్య ఏంటో చూసిన ఆయన ఆ సమస్యలు తీర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేసినట్లు తెలిపారు.
ఈ భూమి ఉన్నంత వరకు ప్రజలు సీఎం కేసీఆర్ను మరువబోరని తెలిపారు. దేశంలో దారిద్య్రం, పేదరికం, ఆకలి చావులు పోవాలంటే బీఆర్ఎస్ రావాల్సిందేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అవిశ్రాంత పోరు వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో పాటు, అనతి కాలంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి నోచుకుందని తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్కుమార్, నల్లమోతు భాస్కర్రావు, పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు చింతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఇరిగి పెద్దులు, బోనగిరి దేవేందర్ పాల్గొన్నారు.
నీలగిరి, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం జిల్లా చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించింది. ఒకేసారి 100మంది రక్తదానం చేసి మొత్తంగా 700పైచిలుకు టీఆర్ఎస్ శ్రేణులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, రమావత్ రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుతో కలిసి ప్రారంభించారు. జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు ఒకేసారి 100మంది రక్తదానం చేసి రికార్డు సృష్టించారు.
మొత్తంగా 700 పైచిలుకు బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేయగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంకులు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం విజయవంతానికి వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పేర్ల నమోదుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12స్టాళ్లు ఏర్పాటు చేసి ఒక మెడికల్ అఫీసర్, ఏఎన్ఎం, రెండో ఏఎన్ఎం, ఇద్దరు ఆశ వర్కర్లను నియమించారు. రక్తం సేకరించేందుకు ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది బ్లడ్ బ్యాంకుల నుంచి ప్రత్యేక సిబ్బందిని తీసుకొచ్చారు. 40మంది టెక్నిషీయన్లు, 100మంది ఇతర పారామెడికల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని డీఎంహెచ్ఓ కొండల్రావు పర్యవేక్షిం చారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్ పాల్గొన్నారు.
మా బతుకులు బాగు చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ సారు. పెట్టుబడి పైసలు లేక పంటలు పండక ఇబ్బందులు పడుతుంటే మాకు పెట్టుబడి సాయం, పండిన పంటలకు గిట్టుబాటు రేటు ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్. మేము ఆయన దయవల్ల చల్లగా బతుకుతున్నాం. ఆయన పుట్టినరోజు నాడు మరొకరి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేస్తున్నందును నాకు చాలా సంతోషంగా ఉంది.
– కట్టెకుంట్ల పెద్దులు, నల్లగొండ
తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ సారు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారు. అలాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని నా వంతు బాధ్యతగా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నా. ఆయన జన్మదినం రోజున ఇలాంటి సామాజిక కార్యక్రమంలో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది.
– చింతకుంట్ల పరమేశ్, తిరుమలగిరి
తెలంగాణ రాష్ట్ర సాధకుడే గాక భావి భారత నాయకుడు సీఎం కేసీఆర్ సారు. ఆయన మరెన్నో పుట్టిన రోజు వేడుకులు జరుపుకొని నాలాంటి వారెందరికో ఉపాధి అవకాశాలు కల్పించాలి. సారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నా వంతు బాధ్యతగా రక్తదాన కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. రక్తదానంతో మరొకరికి ప్రాణం దక్కితే నేను ఈ రకంగానైనా కేసీఆర్ సారు రుణం తీర్చుకున్న వాడినవుతా.
– బోనాల శివకుమార్, జానకిపురం, యాదాద్రిభువనగిరి జిల్లా