రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నది. రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. సాగుకు 3 గంటల కరెంట్ చాలని, రైతులు 10హెచ్పీ మోటర్లు వాడాలని ఉచిత సలహాలు ఇస్తున్నది. కాంగ్రెస్ అర్థం లేని మాటలపై రైతులు మండిపడుతున్నారు. మూడు మాడు పగులగొడుతామని ఆగ్రహం చేస్తున్నారు. అన్నదాతను ఆగం చేయడమే లక్ష్యంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల్లో షాక్ ఇస్తామని హెచ్చరిస్తున్నారు.
నాకు 5 ఎకరాల భూమి ఉంది. నాకున్న భూమిలో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. ప్రస్తుతం బోరుకు 3 హెచ్సీ మోటరు పెట్టి నీటిని తోడుకొని సాగు చేస్తున్నం. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదు. వ్యవసాయానికి 10 హెచ్పీ మోటర్లు వాడుతారనే విషయమే మాకు తెలియదు. ఇప్పుడు రేవంత్రెడ్డి 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని చెబుతున్నడు. మరి ఆ మోటర్లు మాకు ఎవరు కొనిస్తరు.
పెద్ద మోటర్లు కొనే సామర్థ్యం లేకనే ఇన్నేండ్లుగా 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లతో వ్యవసాయం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కరెంటు కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. లోఓల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. కాలిన ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేయడం కోసం కనీసం వారం రోజులు ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ఈలోపు పొలాలు పూర్తిగా ఎండిపోయేవి. ఇప్పుడు మళ్లీ మూడు గంటల కరెంటు చాలు, 10 హెచ్పీ మోటరు పెట్టుకోండి అంటూ చెబుతున్నరు.
మళ్లీ ఆ కరెంటు కష్టాలు మాకొద్దు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అందిస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్తో పాటు, పంట పెట్టుబడి సాయంతో రైతుల కష్టాలు తీరినై. ఇంత మంచిగా కరెంటు ఇస్తున్న సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు, 10 హెచ్పీ మోటర్లు వాడాలని చెప్పడం మంచిది కాదు. ఎవరు ఏమి మాట్లాడినా కేసీఆర్ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటేనే రాష్ట్రంలో రైతులకు మేలు కలుగుతున్నది.
-దుర్గం లింగయ్య, రైతు, బొప్పారం, కేతేపల్లి మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోజుకు ఆరు గంటల కరెంటు.. అది కూడా మూడు విడుతలుగా ఇస్తే మరి కూడా పారక పోయేది. కరెంటు ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వక పొలం కాడనే కాపలా కూసునేది. రాత్రి పూట గిట్ల పొలం దగ్గర మంటలేసుకొని కూసునేది. ఎంత చేసినా పొలం మొత్తం పారక సగం పంట ఎండిపోయేది. తెలంగాణ వచ్చినంకనే కరెంటు బాధలు పోయినై. కరెంటు కోసం ఇబ్బంది పడేది తెల్వకుండా పోయింది. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో పొలం మొత్తం నీళ్లు పారుతున్నయ్. మోటర్లు కాలుడనేదే లేకుండా పోయింది. బోర్లలో కూడా మంచిగ నీళ్లుంటున్నయ్. ఈ పదేండ్లలో కరెంటుకు, నీళ్లకు ఏనాడూ ఇబ్బంది పడలే.
మళ్ల కాంగ్రెస్సోళ్లు వస్తే పాతకాలమే వస్తది. సాగుకు మూడు గంటల కరెంట్ చాలు, 10 హెచ్పీ మోటరు పెట్టుకోవాలని రేవంత్రెడ్డి మాట్లాడుతుండు. పెద్ద మోటరు కొనాలంటే యాభైవేల వరకు కావాలె. వైర్లు, పైపులు మార్చుకోవాలె. ఆ మోటరు నుంచి ఒకే సారి నీళ్లు బయటికి వస్తే అంతా వృథా అవుతై. ఇవన్నీ రైతుల గురించి, వ్యవసాయం గురించి తెల్వనోళ్లు మాట్లాడే మాటలు. రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెసోళ్లు మాకొద్దు. రైతుల గోస తీర్చిన సీఎం కేసీఆరే మాకు కావాలె.
వల్లపురెడ్డి వెంకట్రెడ్డి, రైతు, తిప్పలమ్మగూడం, తిప్పర్తి మండలం
కాంగ్రెసోళ్లు మళ్లీ రైతులను గోస పెట్టడానికే కుట్రలు పన్నుతున్నగా వారి మాటలను బట్టి అర్ధమవుతున్నది. 10 హెచ్పీ మోటర్ పెట్టుకుంటే మూడు గంటల కరెంట్ సరిపోతది. రైతులకు 24 గంటలు ఎందుకు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతుండు. 10 హెచ్పీ మోటరు పెట్టి మూడు గంటలు ఏకధాటిగా నడిపిస్తే బోర్లలో, బావుల్లో ఉన్న నీరంతా దెబ్బకు ఒక్కరోజులో అయిపోతది. ఆ తర్వాత పొలానికి నీళ్లు ఎక్కడ నుంచి తేవాలి. 10 హెచ్పీ మోటర్లను అందరూ ఒకే సారి ఆన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా, రోజుకో కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలె. యాడికెళ్లి తెస్తరో వాళ్లే చెప్పాలె.
కాంగ్రెసోళ్లకు ఇంతన్న ఇంగిత ఙ్ఞానం లేదు. గతంల కాంగ్రెస్ ప్రభుత్వమప్పుడు సరిగా కరెంట్ ఇవ్వకనే నానా బాధలు పడ్డం. రాత్రిళ్లు పెళ్లాం పిల్లల్ని వదిలి పొలాల్లో దోమల మధ్య పడుకుంటూ కరెంట్ కోసం ఎదురు చూసేటోళ్లం. సీఎం కేసీఆర్ పుణ్యమా అని ఇప్పుడు 24 గంటల కరెంట్తో సల్లంగా బతుకుతున్నం. అది ఓర్వలేక కాంగ్రెసోళ్లు మళ్లీ మూడు గంటల కరెంట్ చాలంటూ మా మీద కుట్ర చేస్తున్నరు. 10 హెచ్పీ మోటర్లను మంచి ఆసాములే కొనలేరు. మేము ఎక్కడి నుంచి తేవాలె. ఇక నుంచి రైతులను ఆడిపోసుకుంటే ఊరుకోం. రాబోయే ఎన్నికల్లో అలాంటి వారికి ఓటుతోనే బుద్ధి చెబుతం.
– సంకలమద్ది వెంకటనరసింహారెడ్డి, రైతు, గండ్రవానిగూడెం, మాడ్గులపల్లి
గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక, రాత్రి వేళల్లో రాత్రి వేళల్లో ఇవ్వడంతో మోటర్ల దగ్గర, బావుల దగ్గర వెళ్లి రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మా గ్రామంలో తుంగపాడు వాగులో మోటర్లు పెట్టి నీటిని పొలాలకు పెట్టుకునే రైతులు చాలా మంది రాత్రి వేళల్లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంకనే 24 గంటల విద్యుత్ ఇస్తుండడంతో ఆ బాధలు పోయినై. ఉదయం వేళల్లో ఉప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్లి నీళ్లు పెట్టుకుంటున్నరు.
ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వాళ్లు మూడు గంటలే కరెంట్ ఇస్తమంటున్నరు. మూడు గంటల కరెంట్తో మా ఊర్లో మూలమడి కూడా తడవదు. పదెకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులకు 10 హెచ్పీ మోటార్ లాభం. చిన్న రైతులకు వాటివల్ల ఏం లాభం. ఇంకా పెద్ద మోటరు పెడితే ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్దది పెట్టాలె. అవన్నీ ఎవరు పెడ్తరు. రైతులను ఇబ్బందులు పెట్టి వారి ప్రాణాలు తీయడానికే కాంగ్రెసోళ్లు ఇట్లాంటివన్నీ చెబుతున్నరు. నిత్యం రైతులకు అండగా ఉంటూ సరిగా కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే రైతులందరూ ఉంటరు.
– కలకొండ వెంకటేశ్వర్లు, రైతు, రాగడప, త్రిపురారం
10 హెచ్పీ మోటర్ కొనుక్కునే స్థోమత రైతులకు లేదు. చిన్న, సన్నకారు రైతులు తమ కున్న మూడు, నాలుగు ఎకరాల్లో నీటిని పారించేందుకు 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే వాడుతరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 24 గంటల కరెంట్ మాకు సరిపోతుంది. 10 హెచ్పీ మోటర్ కొని పెట్టుకోవాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి అంత డబ్బు ఎవరిస్తరు. ఇంకా సాగుకు 3 గంటల కరెంటే చాలంటున్నరు. ఇవన్నీ వ్యవసాయాన్ని నాశనం చేసే మాటలే.
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో రైతులు లేరు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఆరుగంటల కరెంట్ పొద్దున, రాత్రి ఇచ్చేటోళ్లు. రాత్రి పూట మోటర్లు ఆన్ చేయడానికి వెళ్లి అనేక మంది రైతులు కరెంట్షాక్తో విష పురుగులు కుట్టి మరణించారు. సీఎం కేసీఆర్ రైతులను రాజును చేయాలని చూస్తుంటే.. కాంగ్రెస్ వాళ్లు మాత్రం నిండా ముంచాలని చూస్తున్నరు. కాంగ్రెస్ నాయకుల మాటలను రైతులు నమ్మరు. వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతు తెలుపుతరు.
– మెగావత్ రవినాయక్, గాత్తండా, తిరుమలగిరి(సాగర్)
నాకున్న ఇరవై ఎకరాల భూమిలో ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేస్తున్న. దీనికి బోరు ద్వారా నీటిని అందిస్తున్న. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడంతో పంటలకు అవసరం ఉన్న సమయంలో నీటిని అందిస్తున్నం. ఇక కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంటు అంటే మా భూములు తడిసినట్టే.. మా పంటలు పండినట్లే.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సరిగా కరెంటు ఇవ్వకనే రైతులు నిండా మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డరు. వాళ్లనను నమ్ముకుంటే ఇగ అంతే. 10 హెచ్పీ మోటరు పెట్టుకొమ్మని ఉచిత సలహాలు ఇస్తున్నరు. అసలు వాళ్లకు వ్యవసాయం గురించి తెలుసా.. కాంగ్రెసోళ్లకు రైతులంటే ప్రేమ లేదు. గతంలో ఇట్నే చేసి రైతులను నిండా ముంచినరు. ఇప్పుడు వాళ్ల మాటలు నమ్ముకుంటే మొత్తం మునుగుతం.
– సురిగి ఎట్టయ్య, అంతంపేట, గట్టుప్పల్ మండలం