నల్లగొండ జిల్లాలో మరోసారి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నకిరేకల్లో, సాయంత్రం 4 గంటలకు నల్లగొండలో జరిగే బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. సభలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు సిద్ధమవుతున్నారు. నేడు జరుగనున్న సభలతో ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం పూర్తి కానున్నది. మంగళవారం సూర్యాపేటలో జరిగే చివరి సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని చోట్లా ఉద్యమ నేత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్19(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరుగనున్న బహిరంగసభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ముందుగా మానకొండూరు, స్టేషన్ ఘనపూర్ మీటింగ్స్లో పాల్గొన్న అనంతరం కేసీఆర్ హెలికాప్టర్లో జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి నేరుగా నకిరేకల్కు చేరుకుంటారు. నకిరేకల్ మూసీ రోడ్డులో ఏఎమ్మార్పీ కాల్వ పక్కనే విశాలమైన ప్రదేశంలో ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ బడుగుల లింగ య్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, రాష్ట్ర గొర్రెల అభివృద్ధ్ది సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చెరుకు సుధాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం పలుమార్లు సభాస్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండాచర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్ స్థలా లు, గ్యాలరీలు, సభావేదిక నిర్మాణంతో ఏర్పాట్లను పూర్తి చేశారు. సభకు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. అభివృద్ధ్ది ప్రదాతకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానం చాటుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
నల్లగొండ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద బహిరంగసభకు పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో సాయంత్రం 4 గంటలకు నకిరేకల్ నుంచి నల్లగొండకు చేరుకుంటారు. పక్కనే కొద్దీ దూరంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. సీఎం రాక కోసం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్రెడ్డి, చకిలం అనిల్కుమార్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పరిశీలించారు.
సభా స్థలానికి నలువైపులా కొద్దీ దూరంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. అక్కడే తమ వాహనాలను పార్క్ చేసి కాలినడకన సభా ప్రాంగణానికి ప్రజలు చేరుకోవాల్సి ఉం టుంది. సభా ప్రాంగణంలోనూ మంచినీరు, మజ్జిగ లాంటివి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. వీఐపీలు, మీడియా, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు ఇలా వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలో చిట్టచివరి ఎన్నికల సభ సూర్యాపేటలో మంగళవారం జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేటలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఇందుకు మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సూర్యాపేట సభతో ఉమ్మడి జిల్లాలో 12కు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం పూర్తైనట్లే. ఇక ఇప్పటివరకు జరిగిన అన్ని సభకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఊహించిన దాని కంటే రెట్టింపు సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, వివిధ పథకాల లబ్ధిదారులు, సామాన్య ప్రజలు సభలకు వచ్చి కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్దగా ఆలకిస్తున్నారు. అన్ని చోట్ల కేసీఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేసీఆర్ సభలకు వస్తున్న స్పందనను చూస్తుంటే ఉమ్మడి జిల్లాలో మరోసారి గులాబీ జెండాకు ఎదురుండదన్న చర్చ జోరుగా సాగుతున్నది.