నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో సాగునీటితో పాటు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని గాడిలో పడేలా చేసిన సీఎం కేసీఆర్ సాగును ప్రోత్సహించేలా రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ఆలోచించారు. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకపోయినా 2018 వానాకాలం నుంచి నేటి వరకు 11 దఫాలుగా అందించి రేపు మరో దఫాకు రంగం సిద్ధం చేశారు.
ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొప్పున ఉమ్మడి జిల్లాలో 11లక్షల పైచిలుకు రైతులకు ఏటా రూ.2500 కోట్లు అందిస్తూ వస్తున్నారు. ఆరేండ్లలో జిల్లా రైతులకు ప్రస్తుత యాసంగితో కలుపుకుంటూ సుమారుగా రూ.13వేల కోట్ల లబ్ధి జరిగినట్లే. సాగునీరు, కరెంటు, రైతుబంధు లాంటి వాటితో 2014లో ఉమ్మడి జిల్లాలో 13లక్షల ఎకరాలుగా ఉన్న సాగుభూమి ప్రస్తుతం 26లక్షల ఎకరాలకు పెరిగింది.
కరువు జిల్లా నుంచి పచ్చని మాగాణి పండుతున్న జిల్లాగా రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేస్తున్న జిల్లాగా ఉమ్మడి నల్లగొండ చరిత్రకెక్కింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నేతలకు కండ్లు మండుతున్నాయి. రైతాంగంలో తమ ఉనికినే ప్రశ్నార్థకం అవుతుందన్న భయం పట్టుకుంది. అందుకే ఈ ఎన్నికలను ఆసరా చేసుకుని పైకి కల్లబొల్లి మాటలు చెబుతూ లోలోపల కుట్రలకు తెరలేపుతున్నారు. వాళ్ల కుట్రలు ఎలాంటివన్న దానికి వాళ్లు చెబుతున్న మాటలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇప్పటివరకు సీఎం కేసీఆర్ సర్కార్ భూయజమానులకే రైతుబంధు అందిస్తున్నది. కౌలు రైతుల్లో మెజార్టీ భాగం తమకున్న భూమిని సాగు చేసుకుంటూనే పక్క రైతుల భూములు కౌలుకు చేస్తుంటారు. అంతేగానీ పూర్తిగా కౌలు భూమిపైనే ఆధారపడే పరిస్థితులు చాలా తక్కువ. అందుకే అసలు రైతులకే రైతుబంధు ఇవ్వాలని కేసీఆర్ అమలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా రైతుబంధును విభజించు పంచిపెట్టు అన్న చందంగా మార్చే ప్రయత్నం చేస్తున్నది.
తన ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులతో పాటు కౌలుదారులకు రైతుబంధు ఇస్తామని చెప్పింది. అంటే ఒకే భూమికి ఇద్దరికీ ఇస్తామన్న ధోరణిలో ప్రచారం చేస్తోంది. దీనిపై అసలు స్వరూపం ఏంటో నేతల మాటల్లో స్పష్టం అవుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఇదే విషయమై ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టత కోరగా రైతబంధు డబ్బులు ఇద్దరికీ ఇవ్వబోమూ… రైతులకు లేదా కౌలుదారుల్లో ఒక్కరికే ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ అసలు కుట్ర బట్టబయలైంది. తన భూమిని కౌలుకు ఇచ్చిన యజమాని కౌలు డబ్బుల కోసం రైతుబంధు డబ్బులను వదులుకుంటారా అన్నది తేలాల్సిందే.
ఇలాంటి పరిస్థితినే వస్తే అసలు రైతు తన భూమిని పడావు పెట్టుకుంటాడు తప్ప కౌలుకే ఇవ్వని పరిస్థితి తలెత్తుంది. అలాంటప్పుడు కౌలుదారుకు సాగు చేసేందుకు భూమి దొరకని గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి. ఇక కౌలు రైతు అని చట్టపరంగా ఎలా నిర్ధారిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇదే విషయంలో ఆ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మట్లాడుతూ కౌలుదారు చట్టం తెస్తామని చెప్పాడు. ఒక గుంట భూమి సైతం లక్షలకు లక్షలు ధర పలుకుతున్న ఈ తరుణంలో ఒక రైతు తన భూమిని ఎకరానికి ఇచ్చే ఐదారు వేల కౌలు డబ్బుల కోసం చట్టపరంగా కౌలు ఒప్పందం చేసుకుంటాడా అన్నది సమాధానం లేని ప్రశ్ననే. ఇలా రేవంత్రెడ్డి మాట్లాడే దానికి భట్టీ విక్రమార్క లేదా ఇంకో నేత మాట్లాడే దానికే పొంతన ఉండడం లేదు. ఇలాంటి నేతలతో ఆరు గ్యారంటీల అమలు ఏలా సాధ్యమనేది ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎకరాకు ఇస్తున్న రూ.10వేలు రూ.16వేలు చేస్తానని మానిఫెస్టోలో ప్రకటించారు. ఎక్కడా చెప్పకుండానే 2018 వానాకాలం నుంచి రైతుబంధు అమలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు చెప్పాడు కాబట్టి అమలు చేసి తీరుతాడని రైతులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ధరణితో భూయజమానులకే సర్వహక్కులు కల్పిస్తూ దాని ఆధారంగానే రైతుబంధు నగదు, రైతు బీమా అమలు, పంట కొనుగోళ్ల డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఎక్కడా లంచాలకు తావు లేకుండా.. ఇంకొకరి జోక్యం లేకుండా.. ప్రతి పైసా ప్రయోజనం రైతులకే చెందేలా కేసీఆర్ అత్యంత పకడ్బందీగా రైతు పథకాలు అమలు చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి… హామీలు ఇవ్వాలి కాబట్టి… ఇచ్చామన్న ధోరణితో కాంగ్రెస్ పెద్దలు చెబుతున్న మాటలపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల రోజుకో తీరుగా మారుతున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల పెద్దన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నే మూడోసారి గెలిపించుకుంటామని శపథం చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాల కాంగ్రెస్కు మరోసారి కర్రు కాల్చి వాత పెట్టనున్నట్లు రైతాంగం ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నది.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎన్నికలకు ముందే రైతుబంధుపై కొర్రీలు పెడుతున్నాడు. రైతులు ఇలాంటి వాగ్దానాలు నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులకు సకాలంలో రైతుబంధుతోపాటు 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. కాంగ్రెసోళ్లు 6 గ్యారెంటీలు అని పెట్టిన మ్యానిఫెస్టోలో చెబుతున్న వాటిలో రైతుబంధు పట్టాదారునికి, కౌలు రైతుతకు ఇస్తామని ముందే ప్రకటించి ఓట్లు అడగడానికి తిరుగుతున్నారు. కానీ.. రేవంత్రెడ్డి కౌలుదారునికి రైతుబంధు ఇస్తే పట్టాదారునికి ఇవ్వమని, పట్టాదారునికి ఇస్తే కౌలు రైతుకు ఇవ్వమని చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు. పట్టాదారునికి రైతుబంధు ఇవ్వకపోతే కౌలుదారునికి ఏ ప్రూఫ్తో రైతుబంధు ఇస్తారో వారికే తెలియాలి. ఎన్నికల ముందే మాటలు మారుస్తున్న కాంగ్రెసోళ్లు గెలిస్తే రైతులను పట్టించుకోవడం కాదు కదా.. దగ్గరకు కూడా రానివ్వరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుంది.
– నామిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతు సంఘం నాయకుడు, వేములపల్లి
కాంగ్రెస్ పార్టీ నాయకులు పూటకో మాట మాట్లాడుతన్నరు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధును ఒకరు దుబారా అంటారు. మరొకరు కౌలు రైతులకు చట్టం తెస్తామంటారు. ఇంకొకరు మూడు గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్లు, రైతులను బిచ్చగాళ్లు అని పేర్కొంటారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థులందరూ అవగాహనా రాహిత్యంతో మాట్లాడి రైతులను కించపర్చుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలు భూమి యాజమానులకు, కౌలు రైతులకు మధ్య ఘర్షణ పెట్టే విధంగా ఉన్నాయి. ఈ విధానం వల్ల కౌలు రైతులకు పనిలేకుండా చేస్తారు.
కౌలు రైతుకు రైతుబంధు డబ్బులు ఇస్తే యాజమానులు ఎలా ఒప్పుకొంటారు. రికార్డు పరంగా భూమి హక్కులు యాజమానికే ఉంటాయి. యాజమానికి, కౌలు రైతుకు మధ్య పొసగనప్పుడు ఇష్టం ఉన్న రైతుకు భూమిని కౌలుకు ఇస్తారు. రెండేండ్లకు ఇద్దరు కౌలు రైతులు మారుతారు. అప్పుడు ఎవరికిస్తారు డబ్బులు. ఇదంతా ఒట్టి మాటలే. వారు వచ్చేది లేదు.. ఇచ్చేది లేదు. రైతులు వారి మాటలు నమ్మరు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు, రైతులు సంతృప్తిగా ఉన్నారు.
– కుందూరు వీరకోటిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, దామరచర్ల
వ్యవసాయంపై అవగాహన రాహిత్యంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుండు. రైతుబంధుపై ఎన్నికల ముందే మాట మార్చిండు. రైతుబంధును భూమి యజమాని లేదా కౌలు రైతుల్లో ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. భూమి ఎవరి పేరు మీద ఉంటుందో వారికే రైతుబంధు ఇవ్వాలె.
ఎన్నికల ముందే ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు కర్మగాలి అధికారంలోకి వస్తే అసలు రైతుబంధు ఇస్తారో? ఇయ్యరో? అన్న అనుమానం కలుగుతుంది. రేవంత్రెడ్డివి అన్నీ గారడి మాటలే. అధికారంలో రాకముందే ఇన్ని కొర్రీలు పెడుతున్న కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దు. రైతులతో ఆటలాడుకునే కాంగ్రెస్ వద్దు.. వారి పాలన వద్దు. మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం.
-పడమటి మధుసూదన్రెడ్డి, రైతు, కిసాన్నగర్, భువనగిరి
భూమిని కౌలుకిచ్చినంత మాత్రాన మాకు రైతుబంధు ఇవ్వరా.. మేము రైతులం కామా? మేము మా భూమిని కౌలుకిచ్చి వేరేతానికి పోతాం. భూమి మీద హక్కు కలిగి ఉన్న మాకు రైతు బంధు ఇవ్వకపోవడం ఏంటి? కాంగ్రెస్ వాళ్లు అర్థమై మాట్లాడుతున్నరా తెలియడం లేదు. కౌలు రైతులకే రైతు బంధు ఇస్తామని చెప్పడం టీవీల్లో చూస్తున్నాం. ఇది సమంజసం కాదు.
ముఖ్యమంత్రి కేసిఆర్ అందరికీ రైతు బంధు ఇస్తున్నాడు. నాకున్న మూడు ఎకరాలకు పదిహేను వేలు వస్తుంది. ఈ డబ్బుతో వరి సాగు చేశాను. ఇప్పుడు పంట కోతకొచ్చింది. అలాగే మిర్చి పంటకు ఎరువులు కొనుగోలు చేసేందుకు ఈ డబ్బులు అక్కరకు వస్తాయి. ఎన్నికల సమయంలో కూడా రైతు బంధు నగదు ఇస్తున్న సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరిచిపోం.
– నోముల అంజయ్య, రైతు, గన్నెర్లపల్లి, చందంపేట మండలం
రైతుబంధుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డివి దగాకోరు మాటలు. ఒకసారి కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామనడం, మరోసారి రైతులకు ఇస్తామనడం, ఇంకోసారి ఆ ఇద్దరిలో ఒకరికే ఇస్తామంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండు. ఎన్నికలకు ముందే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక అసలు రైతుబంధు ఇస్తాడో, ఇవ్వడో తెలియని పరిస్థితి. కేసీఆర్ గవర్నమెంట్లో రైతులందరికీ రైతుబంధు ఇస్తున్నరు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా ఇవ్వట్లే. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నీళ్లు, కరెంటు, అభివృద్ధి ఉండదు. కాంగ్రెస్ నాయకులు రైతులను మభ్యపెడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు వద్దు, వాళ్ల గవర్నమెంట్ వద్దు. కేసీఆర్ సారే రైతులకు మంచి చేస్తుండు. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, కరెంటు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుండు. రైతులమంతా కేసీఆర్కే మద్దతిస్తాం.
-కొమురెల్లి బాల్రెడ్డి, సీతవానిగూడెం, భూదాన్పోచంపల్లి