నల్లగొండ, అక్టోబర్ 3: ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని, వారికి పెండ్లి సమయంలో కట్నం సమస్య రావొద్దని మేనమామలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థ్దిక సాయం అందిస్తున్నాడని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వివిధ మండలాలకు సంబంధించి 363 మందికి రూ.3,63,42,108 కోట్ల విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, 393 మందికి జీఓ 58 ప్రకారం 393 మందికి ఇండ్ల పట్టాలను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ ఆడబిడ్డ పుట్టిన తర్వాత చదువుకు ఇబ్బంది పడొద్దని గురుకులాలు, కాన్పు సమయంలో కేసీఆర్ కిట్ లాంటవి ఇచ్చి నిత్యం వారి సంక్షేమం కోసమే పాటు పడుతున్నట్లు తెలిపారు. కల్యాణ లక్ష్మి ద్వారా తాను ఎమ్మెల్యేగా గెలపొందిన దగ్గర నుంచి ఇప్పటి దాక 13వేల మందికి ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. నేడు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ అందాయని, ఫలం అందని గడపే లేదని అన్నారు. ఇంత సంతృప్తిగా ఉన్న రాష్ట్రంలో పాలన ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తూ విషం చిమ్ముతున్నట్లు తెలిపారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ఒక్క రూపాయ కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మకుండా మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ను మూడో సారి సీఎం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పాల్గొన్నారు.