సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సాయం చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాల అమలుతో రాష్ట్రం స్వర్ణయుగంలా మారింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటున్నది. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందించి తోడుగా ఉంటున్నది. మాతాశిశు సంరక్షణకు ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. వృత్తిదారులు, అట్టడుగు వర్గాలకు అనేక పథకాలతో సాయం చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సంక్షేమ సంబురాలు నిర్వహించనున్నారు. లబ్ధిదారులతో కలిసి సమావేశాలు జరిపించనున్నారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సంక్షేమం గురించి చర్చించాలంటే.. తెలంగాణ కంటే ముందు.. తెలంగాణ తర్వాత అని చెప్పవచ్చు. రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగంలా దూసుకెళ్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాలతో ప్రభుత్వం ప్రజలకు పథకాలను అమలు చేస్తున్నది. పదుల సంఖ్యలో పథకాలు కొనసాగిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆడబిడ్డల పెండ్లి భారం కాకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్2014 నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారు. ఆయా పథకాల కింద మొదట రూ.51 వేల ఆర్థిక సాయం అందించేది. ఆ తర్వాత రూ. 75,116 పెంచి, అనంతరం 2018లో కేసీఆర్ పెద్ద మనసుతో దాన్ని రూ. 1,00,116కి పెంచారు. జిల్లాలో ఇప్పటి వరకు 25,887మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ. 248.80 కోట్లు ఖర్చు చేసింది. షాదీముబారక్ పథకానికి సంబంధించి 1,110మంది లబ్ధిదారులకు రూ.10.50 కోట్లను ఖర్చు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడి, గీత, నేత కార్మికులకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నది. ప్రతి నెలా రూ.2,116 పింఛన్ ఇస్తూ అండగా నిలుస్తున్నది. జిల్లాలో సుమారు 1.06లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లను పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,440 కోట్లను వెచ్చించింది. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఒక్కో లబ్ధిదారుడికి కేవలం రూ. 200 పింఛన్ మాత్రమే ఇచ్చేవారు. దివ్యాంగులకు 500 ఉన్న పింఛన్ను రూ. 3116 పెంచారు.
జిల్లాలోని 19 ఎస్సీ హాస్టళ్ల నిర్వహణకు రూ. 38.52 కోట్లను ఖర్చు చేసింది. పోస్ట్, ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ద్వారా 61,537మంది విద్యార్థులకు రూ.89.40 కోట్లను అందించింది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ఉపకార వేతనం కింద 947 మంది విద్యార్థులకు రూ.1.63 కోట్లు ఖర్చు చేసింది. జిల్లాలో ఎనిమిది ఎస్సీ గురుకులాలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఏటా 5 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ దూరదృష్టితో 2021 ఆగస్టులో దళిత బంధు స్కీం తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో ఎంతో లాభం ఒనగూరుతున్నది. జిల్లా వ్యాప్తంగా 412మందికి దళిత బంధులు డబ్బులు గ్రౌండింగ్ అయ్యాయి. ఇందులో భువనగిరి నియోజకవర్గంలో 100మందికి, ఆలేరులో 175మందికి, మునుగోడులో 61 మందికి, నకిరేకల్లో 39 మందికి, తుంగతుర్తిలో 38మందికి దళిత బంధులు డబ్బులు గ్రౌండింగ్ అయ్యాయి.
గిరిజనుల ఆకాంక్షలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 500 మంది జనాభా దాటిన గిరిజన తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చి ఎస్టీల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. జిల్లాలో 500 జనాభా దాటిన 37 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. జిల్లాలో 8 ఎస్టీ హాస్టళ్లలో 774మంది విద్యార్థి వసతి పొందుతున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 2022-23 సంవత్సరంలో 1,078 మంది విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 4.98 కోట్లు జమయ్యాయి. ట్రైకార్ కింద 294మందికి సబ్సిడీ లోన్లకు 6.04కోట్లు మంజూరయ్యాయి.
గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించి మాతా,శిశు మరణాల సంఖ్య తగ్గించడమే ధ్యేయంగా తెచ్చిన ఆరోగ్యలక్ష్మి పథకం సత్ఫాలితాలను ఇస్తున్నది. జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 844 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 57 మినీ అంగన్వాడీ కేంద్రాలు కలిపి మొత్తం 901 సెంటర్లు నడుస్తున్నాయి. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి రోజు సగటును 5 వేల మంది గర్భిణులు, 5వేల మంది బాలింతలు పోషకాహారం పొందుతున్నారు.
జిల్లాలో కేసీఆర్ కిట్ లబ్ధిదారుల సంఖ్య 23వేలు దాటింది. కేసీఆర్ కిట్లో తల్లీబిడ్డలు అవసరమయ్యే సుమారు రూ. 15 వేల విలువైన వస్తువులు అందిస్తున్నారు. అంతేకాకుండా ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ. 12 వేల చొప్పున సాయం చేస్తున్నది. గర్భిణులు రూ. 35 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఫలితంగా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది.
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాలో సంక్షేమ సంబురాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా సభ ఏర్పాటు చేయనున్నారు. లబ్ధిదారుల వివరాలు, జరుగుతున్న లబ్ధి, చేస్తున్న ఖర్చు, దాని ఫలితాలను వివరించాలి. లబ్ధిదారులతోనే వారు పొందుతున్న లబ్ధి గురించి మాట్లాడించనున్నారు. గొల్లకురుమలకు గొర్రెలను పంపిణీ చేయనున్నారు.
జిల్లాలో ఫ్రీ, పోస్ట్ మెట్రిక్ కలిపి 20 హాస్టళ్లలో 1,441 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. 2020-23 ఆర్థిక సంవత్సరంలో హాస్టళ్ల నిర్వహణకు రూ.56.68 లక్షలు మంజూరు కాగా..49.35 లక్షల నిధులు చేశారు. కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ కింద 2022-23 సంవత్సరానికి రూ. 30.94 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలొ 5 బీసీ గురుకులాలు ఉండగా, వీటిల్లో 2560మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం రజకులు, నాయీబ్రాహ్మణులకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఇక జిల్లాలో ఆరు మైనార్టీ గురుకులాల్లో 1,060మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో వక్ఫ్ బోర్డు నుంచి 42 రకాల వక్ఫ్ పనుల కోసం 1.75 కోట్లు, చర్చిల నిర్మాణం కోసం రూ.15 లక్షలు విడుదలయ్యాయి. రంజాన్ పండుగ 2023 సందర్భంగా జిల్లాలో 2500 జతల దుస్తులు పంపిణీ చేశారు. రూ.5లక్షలతో ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.