నకిరేకల్, జూన్ 19 : కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగిన పాదయాత్రలో పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరుగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న కొండేటి మల్లయ్య, దైద రవీందర్, వేదాసు శ్రీధర్ నకిరేకల్ సెంటర్ కార్నర్ మీటింగ్లో ప్రజలకు అభివాదం చేస్తున్న క్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సంబంధించిన డీజే పాటలను వేయడంతో కోమటిరెడ్డి వర్గీయులు జోష్లో మునిగిపోయారు. కార్యకర్తలు జై కోమటిరెడ్డి అని నినాదాలు చేస్తుండడంతో పరిస్థితిని గమనించిన భట్టి విక్రమార్క అందరు నాయకులున్న వాహనం ఎక్కకుండా మరో ఓపెన్ టాప్ వెహికిల్ ఎక్కి ప్రసంగించారు. ఈ పాదయాత్రను కొందరు వ్యక్తులు డిస్టర్బ్ చేస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో అది నచ్చని కొంతమంది కార్యకర్తలు ఒకరినొకరు తోసుకుంటూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా భట్టి ఉన్న వాహనాన్ని నియోజకవర్గ నాయకులు ఎవరూ ఎక్కకుండా సెక్యూరిటీ అడ్డుకున్నారు. దాంతో మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్, రాష్ట్ర నాయకుడు వేదాసు శ్రీధర్ ఇరువురు భట్టి ఉన్న వాహనం ఎక్కే ప్రయత్నంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరురువురి వర్గీయులు అసంతృప్తికి లోనై గొడవకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పరిస్థితిని గమనించి భట్టి ప్రసంగం ముగించే ముందు వారిద్దరినీ భట్టి వాహనంలోకి ఎక్కించారు. టీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాత్రం వేరే వాహనంలో సైలెంట్గా అలాగే ఉండిపోవడం, భట్టి వాహనంలోకి ఎక్కకపోవడంతో వారి వర్గీయులు కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తున్నది.