సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రికార్డుల ప్రకారం వందల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్గా సివిల్ సప్లయ్కి కొన్ని మిల్లులు చెల్లించాల్సి ఉండగా మళ్లీ వాటికే ధాన్యం వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకే యాజమాన్యం కింద ఉన్న మిల్లులు ఒక మిల్లుకు సంబంధించిన తక్కువ మొత్తం బకాయి చెల్లించి రూ.కోట్లలో బకాయి ఉన్న ఇతర మిల్లుల చెల్లింపులు చేయడం లేదు. కానీ ఢీపాల్టర్లో లేకుండా ఈ సారి యాసంగి ధాన్యం వచ్చేలా కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం.
గతంలో సకాలంలో ప్రభుత్వ సంస్థలకు బియ్యం ఇవ్వకపోవడంతో సర్కారు మిల్లులకు 25 శాతం జరిమానా విధించింది. మూడేండ్లుగా 25 శాతం జరిమానా చెల్లించని డీఫాల్ట్ మిల్లులు జిల్లాలో 34 ఉన్నాయి. వాటి బకాయి రూ.75 కోట్లకు పైనే ఉన్నది. 34 మిల్లులు గత రెండు సీజన్లుగా రూ.120 నుంచి రూ.200 కోట్ల ధాన్యం తీసుకొని ఒక్క గింజ బియ్యం తిరిగి ఇవ్వలేదు. ఈ సీజన్లో సివిల్ సప్లయ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తూ డీఫాల్ట్ మిల్లులు, ఎక్కువ ధాన్యం నిల్వలు ఉన్న మిల్లులకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. దాంతో జిల్లాలో 25 శాతం జరిమానా ఉన్న కొంతమంది మిల్లర్లు సివిల్ సప్లయ్ శాఖకు బియ్యం ఇచ్చి ఈ సీజన్లో తిరిగి ధాన్యం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే వందల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం ఉన్న కొంతమంది డీఫాల్ట్ మిల్లర్లు తమకు అనుకూలంగా ఉండే ఒకరిద్దరు అధికారులను పట్టుకొని కుయుక్తులు పన్నుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో కొన్ని యాజమాన్యాలకు రెండు నుంచి మూడు మిల్లులు ఉండగా అందులో రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల జరిమానా ఉన్న ఒక మిల్లుకు చెందిన 25 శాతం జరిమానా చెల్లించి, రూ.4 నుంచి 6 కోట్లు జరిమానా ఉన్న మిల్లులకు మాత్రం చెల్లించకుండా ఈ సీజన్కు సంబంధించి మరో వంద కోట్ల రూపాయల ధాన్యం తీసుకునేందుకు గత వారం రోజులుగా చర్చలు జరిపినట్లు కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలిసింది.
జిల్లాలో ఐదారుగురు యజమానులకు రెండు నుంచి మూడు మిల్లులు ఉండగా కొంతమంది ఇప్పటికే 25 శాతం జరిమానా చెల్లించి ధాన్యం కేటాయించిన మిల్లుల జాబితాలోకి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ యజమానికి రెండు మిల్లులు ఉండగా గత రెండు సీజన్ల నుంచి అస్సలు బియ్యం ఇవ్వని ఓ మిల్లుకు సుమారు రూ.35 లక్షల విలువ చేసే 132 మెట్రిక్ టన్నుల బియ్యం 25 శాతం జరిమానా బకాయి ఉండగా దానికి సమానమైన బియ్యం ఇటీవల సివిల్ సప్లయ్కి ఇచ్చారు. మరో మిల్లుకు దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే 14,135 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉన్నది. లక్షల్లో బకాయి ఉన్న మిల్లు బకాయి చెల్లించి, కోట్లలో బకాయి ఉన్న మిల్లు బకాయి చెల్లించకుండా ఈ సీజన్ ధాన్యం తీసుకునే కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
జిల్లాలో కొంతమంది అక్రమార్కుల కుయుక్తులను పసిగట్టిన రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ ధాన్యం కేటాయింపుల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని అధికారులకు తీవ్ర స్థాయిలో మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే గత రెండు సీజన్ల నుంచి జిల్లాలో అసలు సీఎంఆర్ బియ్యం ఇవ్వని 12 మిల్లులతోపాటు అత్యధిక బకాయి ఉన్న మరో 25 మిల్లులకు ఈ యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కేటాయింపులు చేయొద్దని ఆదేశాలు అందాయి.
ఎట్టి పరిస్థితుల్లో భారీగా ధాన్యం నిల్వ ఉన్న మిల్లులతోపాటు ఒకే యాజమాన్యం కింద రెండు మూడు మిల్లులు ఉంటే ఏ ఒక్క మిల్లు డీఫాల్ట్ ఉన్నా ధాన్యం ఇవ్వొద్దనే ఆదేశాలు ఉన్నాయి. దాంతో ఐదారు మంది అక్రమార్కులు ఏకమై వారు అనుకున్నట్లు జరుగకపోవడంతో మిల్లర్లందరికీ ఏదో అన్యాయం జరుగుతున్నట్లు చిత్రీకరించి ప్రభుత్వం, సివిల్ సప్లయ్ శాఖకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయాలనే ఆలోచన చేయగా మెజారిటీ మిల్లర్లు వ్యతిరేకించడంతో ఆ ఆలోచన ముందుకు సాగడం లేదని పలువురు మిల్లర్లు పేర్కొంటున్నారు.