చౌటుప్పల్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలో ఇచ్చిన మరో హామీ అమల్లోకి వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.36 కోట్లు కేటాయించింది. మంగళవారం దవాఖాన నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ దవాఖానలో దీర్ఘకాలిక రోగులకు పాలియేటివ్ సెంటర్, కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్ కొనసాగుతున్నాయి.
వంద పడకల దవాఖాన పూర్తయితే 20మందికిపైగా డాక్టర్లు, 100 మందికిపైగా వైద్య సిబ్బందితోపాటు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. చుట్టుపక్కల తొమ్మిది మండలాల పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రస్తుతం బాధితులను హైదరాబాద్కు తరలించాల్సిన పరిస్థితి ఉంది. ఈ దవాఖానతో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టొచ్చన్నది సర్కారు యోచన.
చౌటుప్పల్ , ఏప్రిల్ 17 : చౌటుప్పల్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ దవాఖానను 100 పడకలకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దాంతో సమీప ప్రాంతాల్లో ప్రజలకు నయాపైసా ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్యసేవలు అందనున్నాయి. ఈ దవాఖానలో ప్రతి నిత్యం సుమారు 300 మందికిపైగా ఓపీ సేవలు పొందుతున్నారు. నెలకు 50 వరకు ప్రసవాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు సైతం ఇక్కడేకు వస్తుంటారు. అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో లేక రోగులు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. వీటి దృష్ట్యా మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సమయంలో చండూర్ బహిరంగ సభలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అభ్యర్థన మేరకు వంద పడకలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు మంజూరైన దవాఖానను మంత్రులు హరీశ్ రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
వంద పడకలతో ప్రయోజనాలు..
ఈ దవాఖానలో 100 పడకలు వస్తే పేదలకు నయాపైసా ఖర్చుల లేకుండా 24గంటల వైద్య సేవలు అందనున్నాయి. చౌటుప్పల్తో పాటు సంస్థాన్నారాయణపురం, వలిగొండ, భూదాన్పోచంపల్లి, చిట్యాల, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నా యి. ప్రస్తుతం ఇక్కడ 5గురు వైద్యులు సుమా రు 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వంద పడకల దవాఖానగా మారితే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేయనున్నారు. జనరల్ సర్జన్తోపాటు ఎముకల, చిన్న పిల్లల, చెవు, ముక్కు, గొంతు, గైనకాలజి, అనస్తీషియా ప్రత్యేక విభాగాల వైద్యులు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 20 మంది పైగా వైద్యులు ఇక్కడకు రానున్నారు. 100 మందికి పైగా ఇతర సిబ్బంది కూడా పనిచేయనున్నారు. ప్రత్యేక బ్లడ్ బ్యాంక్, ఐసీయూ కూడా ఏర్పాటు కానుంది. తద్వారా వివిధ రకాల రోగాలకు శస్త్ర చికిత్స చేయనున్నారు. 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకోవడంతో క్షతగ్రాతులకు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రైవేటు దవాఖానకు వెళ్లి అప్పుల్లో కూరుకపోతున్నారు. అంతేకాకుండా గాయపడిన వారి బంధువులు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో వారు ఇక్కడ రావడం ఆలస్యం అవుతున్నది. దాంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమై ఐసీయూ,శస్త్ర చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో మృత్యువాత పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వాటికి చెక్ పెట్టె అవకాశాలు ఉన్నాయి.
నేడు మంత్రుల రాక
చౌటుప్పల్ : చౌటుప్పల్లో 100 పడకల దవాఖాన పనుల శంకుస్థాపనకు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హారీశ్రావు, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి సోమవారం ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం ఎస్ఎంఆర్ పంక్షన్ హాల్లోనిర్వహిస్తున్న బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకానున్నట్లు వివరించారు. కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
మునుగోడు అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
మునుగోడు అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో చండూరు సభలో నియోజకవర్గానికి 100 పడకల దవాఖాన కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. అడిగిన వెంటనే హామీ ఇచ్చి ప్రస్తుతం నేరవేర్చడం సంతోషంగా ఉంది. మంత్రులు కేటీఆర్, తన్నీరు హారీశ్రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి చౌటుప్పల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24గంటల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీనిని త్వరలోనే అమలు చేస్తాం.
– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి